మూడు నగరాల్లో పర్యటించనున్న ప్రధాని మోదీ

దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వ్యాక్సిన్ తయారీపై సమీక్షించడానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి, ఉత్పత్తి చేస్తున్న సంస్థలను ఆయన పరిశీలించేందుకు ప్రధాని మోదీ శనివారం మూడు నగరాల్లో పర్యటించనున్నారు. కొవిడ్ టీకా పురోగతి పనులను సమీక్షించేందుకు అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, పుణె నగరాల్లో ప్రధాని పర్యటిస్తారు. అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్‌, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ, పుణెలోని సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియాను ప్రధాని మోదీ సందర్శించనున్నారని ప్రధానమంత్రి కార్యాలయం తన ట్విట్టర్‌లో తెలిపింది. కొవిడ్‌పై పోరాటంలో భారత్ కీలక దశకు చేరుకున్నదని, టీకా ఉత్పత్తి చేస్తున్న కేంద్రాలను పరిశీలించడం, అక్కడ ఉన్న శాస్త్రవేత్తలతో సంప్రదించడం వల్ల .. టీకా గురించి సమగ్ర సమచారం తెలుస్తుందని పీఎంవో తన ట్వీట్‌లో పేర్కొంది. దేశ పౌరులకు వ్యాక్సిన్ ఇవ్వడానికి ఎదురయ్యే సవాళ్లను, కార్యాచరణను తయారు చేసేందుకు ఈ పర్యటన వీలవుతుందని పీఎంవో తన ప్రకటనలో వెల్లడించింది.

అయితే, ప్రధాని మోదీ హైదరాబాద్‌ టూర్‌ షెడ్యూల్‌లో స్వల్పమార్పు చోటు చేసుకుంది. సాయంత్రానికి బదులు మధ్యాహ్నం ఒంటిగంటకే హైదరాబాద్‌ చేరుకుంటారు ప్రధాని. భారత్‌ బయోటెక్‌లో కరోనా వ్యాక్సిన్ తయారీని పరిశీలించిన తరువాత హకీంపేట్‌ నుంచి ఢిల్లీకి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతారు ప్రధాని. అయితే ప్రధాని మోదీ పుణే టూర్‌ రద్దయ్యింది. సీరం ఇనిస్టిట్యూట్‌లో వ్యాక్సిన్‌ తయారీని మోదీ పరిశీలించాల్సి ఉంది. అయితే ఈ పర్యటన రద్దయ్యింది.