ఒంగోలు సమీపంలో అగ్నిప్రమాదంలో కాలి బూడిదైన పెట్రోల్ బంక్

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సూరారెడ్డిపాలెం సమీపంలో ఉన్న భారత్ పెట్రోల్ బంక్‌లో మొక్కజొన్న లోడుతో వెళ్తున్న లారీ డీజిల్ కోసం వెళ్లింది. ఇంతలో లారీ టైర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ వెంటనే మంటలు వేగంగా వ్యాపించి పెట్రోల్ బంక్‌కు అంటుకున్నాయి. స్థానికులు, బంక్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.. వెంటనే వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో.. వారు అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేశారు.

ఈ ప్రమాదంలో లారీతో పాటూ, పెట్రోలు పంపు, రీడింగ్‌ మిషన్‌ దగ్ధమయ్యాయి. పక్కనే ట్యాంకర్లలో ఉన్నపెట్రోలియం నిల్వలకు మంటలు అంటుకోకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ మిర్యాలగూడ నుంచి చెన్నై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సుమారు రూ. 10లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.