వాంఖడేలో ఐపీఎల్ మ్యాచ్‌లకు మరో చిక్కు?

మహారాష్ట్రలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో ఐపీఎల్‌ నిర్వహణపై ఇప్పటికీ అనేక ఊహగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ తరుణంలో ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరగాల్సిన మ్యాచ్‌లను వేరే ప్రాంతానికి తరలించాలని కోరుతూ అక్కడి చుట్టుపక్కల ప్రజలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరేకు లేఖ రాశారని ప్రముఖ ఆంగ్ల పత్రిక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం ప్రచురించింది.

ఐపీఎల్‌కు భారీ ఆదరణ ఉన్న నేపథ్యంలో తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ప్రజలు స్టేడియం చుట్టుపక్కల గుమిగూడే ప్రమాదం ఉందని లేఖలో పేర్కొన్నారు. ‘‘కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో వివాహాలు, అంత్యక్రియల వంటి కార్యక్రమాలపై సైతం రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించాల్సి వచ్చింది. ఇందుకు భిన్నంగా ఇలాంటి విపత్కర సమయంలో కొన్నిరోజుల పాటు సాగే ఐపీఎల్‌ మ్యాచ్‌లను ఎలా అనుమతించారు?’’ అని మెరైన్‌ డ్రైవ్‌ రెసిడెంట్స్‌ అసోసియేషన్‌లోని ఓ సభ్యుడు లేఖలో ప్రశ్నించారు.

వాంఖడే స్టేడియంలో ఇప్పటికే 11 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. వీరంతా ఆటగాళ్లలా అక్కడే ఉండకుండా.. వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో స్టేడియానికి వస్తుంటారు. ఈ నేపథ్యంలో స్టేడియం సిబ్బందిని సైతం అక్కడే ఉంచాలని అధికారులు నిర్ణయించారు. మరోవైపు ఐపీఎల్ బ్రాడ్‌కాస్టింగ్‌ బృందంలోనూ 15 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.