స్పుత్నిక్‌-V తో పాటూ మరో వ్యాక్సిన్‌

కరోనా మహమ్మారిని అంతం చేసే దిశగా రష్యా మరింత వేగంగా అడుగులు వేస్తోంది. రష్యా స్పుత్నిక్‌ వీ తర్వాత మరో వ్యాక్సిన్‌ను అక్టోబర్‌ 15 నాటికి తీసుకురవచ్చే ప్రయత్నాలు చేస్తోంది. దాదాపు అన్ని దేశాల వ్యాక్సిన్‌ ప్రయోగదశలోనే ఉండగా.. రష్యా మాత్రం వ్యాక్సిన్‌ను ఏకంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది. సైబీరియాకి చెందిన వెక్టార్ ఇనిస్టిట్యూట్‌ అభివృద్ధి చేస్తున్న ఎపివాక్‌ కరోనా వ్యాక్సిన్‌ను అక్టోబర్‌ 15 నాటికి రిజిస్టర్‌ చేసుకోవచ్చునని రష్యా వినియోగదారుల భద్రతా సంస్థ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్‌కి సంబంధించిన మొదటి దశ ప్రయోగాలు గత వారమే పూర్తయ్యాయి. ఈ రెండు వ్యాక్సిన్లు కనుక ప్రభావం చూపగలిగితే.. ఇక కరోనాను ప్రపంచం జయించినట్టేనని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక రష్యా అభివృద్ధి చేసిన మొదటి వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీ మూడో దశ ప్రయోగాలు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అనేక దేశాలు రష్యాతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్‌కు సైతం దాదాపు కోటి డోసుల్ని పంపిణీ చేయడానికి రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) ఇటీవల ఒప్పందం చేసుకుంది. దీనికి సంబంధించిన ప్రయోగాలను డాక్టర్‌ రెడ్డి ల్యాబ్స్‌ మరికొద్ది వారాల్లో ప్రారంభించనున్నట్టు ఆ సంస్థ ఫార్మాసూటికల్‌ సర్వీసెస్‌ అధికారి దీపక్‌ సార్వా తెలిపారు. దేశవ్యాప్తంగా తొలి దశలో దాదాపు 2,000 మంది వలంటీర్లకు డోసులు ఇస్తామని చెప్పారు.