ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 369 పరుగులకు ఆలౌట్..

బ్రిస్బేన్ వేదికగా టీమ్‌ఇండియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌటైంది. శనివారం ఉదయం 274/5 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజుఆట కొనసాగించిన ఆస్ట్రేలియా మరో 95 పరుగులు చేసి చివరి 5 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్‌ టిమ్‌పైన్‌(50), కామెరూన్‌ గ్రీన్‌(47) రాణించారు.

టిమ్‌పైన్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాక శార్దుల్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో రోహిత్‌ చేతికి చిక్కాడు. తర్వాతి ఓవర్‌లోనే గ్రీన్‌ను వాషింగ్టన్‌ సుందర్‌ బౌల్డ్‌ చేశాడు. మళ్లీ మరుసటి ఓవర్‌లోనే శార్దుల్‌ కమిన్స్‌(2)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా 315 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. ఆపై లైయన్‌(24; 22బంతుల్లో 4×4), మిచెల్‌ స్టార్క్‌(20*; 35 బంతుల్లో 1×6) ధాటిగా ఆడి జట్టు స్కోర్‌ను 350 దాటించారు. చివర్లో హేజిల్‌వుడ్‌(11) పోరాడటంతో ఆస్ట్రేలియా 369 పరుగులు చేసింది. శార్దుల్‌, వాషింగ్టన్‌, నటరాజన్‌ మూడేసి వికెట్లు తీశారు. సిరాజ్‌కు ఒక వికెట్‌ దక్కింది.