భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు: పవన్ కళ్యాణ్

దేశ ప్రజలందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. శ్వేత పద్మధరుడు సూర్య భగవానుడిని ప్రత్యక్ష దైవంగా మనం కొలుస్తాము. ఆ భగవంతుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా ఎంతో వేడుకగా మూడు రోజులపాటు పండుగ జరుపుకొంటాం. పుష్కలంగా పండే పంటలు భారతీయులకు సిరులను అందించే కాలం కావడంతో సంక్రాంతి సంబరాలు ఎంతో ఆడంబరంగా సాగుతాయి. అయితే ఈ సంక్రాంతి పంటలతోపాటు కరోనా మహమ్మారికి విరుగుడుగా వ్యాక్సిన్ కూడా తీసుకురావడం ఎంతో ఆనందదాయకం. సంక్రాంతి తరువాత భారతదేశంలో వ్యాక్సిన్ ప్రారంభం కావడం శుభ పరిణామం. వ్యాక్సిన్ రూపకర్తలకు, ప్రోత్సహించిన ప్రభుత్వాలకు, మార్గదర్శకులైన అధికారులకు అందరికీ ఈ సందర్భంగా అభినందనలు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ముఖ్యంగా తెలుగువారి ఆచార, అభిరుచులను తెలియచేసే ఈ సంక్రాంతి పండుగ దేశ ప్రజలు, తెలుగువారికి సిరిసంపదలతో కూడిన ఆరోగ్య సౌభాగ్యాన్ని అందించాలని నిండు మనసుతో కోరుకుంటున్నాను. మదమాత్సర్యాలు, మత మౌఢ్యాలు భోగి మంటలలో దహనం కావాలని ఆశిస్తున్నాను. హైందవులు పరమ పుణ్య దినాలుగా భావించే ఈ ఉత్తరాయణ కాలం నుంచి పాలకులు ఆదర్శవంతమైన పాలన అందించాలని, జవాబుదారీతనాన్ని అవలంభించాలని ఆశిద్దాం. అనుకూలమైన ప్రకృతితో దేశం సుభిక్షంగా శోభిల్లాలని కోరుకుంటూ నా తరఫున, జనసేన శ్రేణుల తరపున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.