ఫిబ్రవరి వరకు బోర్డు పరీక్షలు వాయిదా..

కరోనా నేపథ్యంలో సీబీఎస్‌సీ 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలను వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరి మధ్య కాలంలో నిర్వహించే అవకాశం లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్‌ తెలిపారు.  తాజాగా మంగళవారం ఉపాధ్యాయులతో ఆన్‌లైన్‌లో సమావేశమైన ఆయన.. ఈ మేరకు వెల్లడించారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు పరీక్షలు నిర్వహించేందుకు అనుకూలంగా లేవని.. బోర్డు ఎగ్జామ్స్‌పై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు.

”పరీక్షలను రద్దు చేసి విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయడం సాధ్యపడదు. ఒకవేళ అలా చేస్తే స్టూడెంట్స్ భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. జాతీయ పరీక్షలకు ప్రిపేర్ కావడం, ఉద్యోగాలు పొందటం కష్టతరం అవుతుంది. అందువల్ల పరీక్షలను రద్దు చేయడం జరగదు. కేవలం మరికొద్ది రోజుల పాటు వాయిదా వేస్తాం. ప్రస్తుతానికి జనవరి-ఫిబ్రవరి మధ్య 10, 12 తరగతుల బోర్డు ఎగ్జామ్స్ మాత్రం జరగవు. త్వరలోనే పరీక్షలు నిర్వహించే తేదీలను ప్రకటిస్తామని” కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు.

బోర్డు పరీక్షలపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులను సిద్ధంగా ఉంచేందుకు పలు పాఠశాలలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో ప్రీ ఫైనల్‌ పరీక్షలను నిర్వహించాయి. బోర్డు పరీక్షలను ప్రత్యక్షంగానే నిర్వహిస్తామని, ఆన్‌లైన్‌లో నిర్వహించబోమని గత నెలలో సీబీఎస్‌ఈ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) ప్రకటించింది.