సీఐడీ నోటీసులపై హైకోర్టులో పిటిషన్ వేయనున్న చంద్రబాబు!

అమరావతిలో భూ దందా జరిగిందని, చంద్రబాబు హయాంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ చోటుచేసుకుందన్న ఆరోపణలపై నిన్న సీఐడీ నోటీసులు ఇవ్వడం తెలిసిందే. దీనిపై చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. సీఐడీ నోటీసుల అంశంపై న్యాయనిపుణుల సలహాలు తీసుకున్న చంద్రబాబు… రేపు హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. అమరావతి భూముల అంశంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని పిటిషన్ లో కోరనున్నారు.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఫిర్యాదుతో చంద్రబాబు, మాజీమంత్రి నారాయణలకు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 41 (ఏ) సీఆర్పీసీతో పాటు ఎఫ్ఐఆర్ ప్రతిని కూడా సీఐడీ పోలీసులు చంద్రబాబు, నారాయణలకు అందజేశారు. చంద్రబాబుపై 120 బీ, 166, 167, 217 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.