ఏపీలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ను ప్రారంభించిన సిఎం జగన్‌

విజయవాడ సర్వజనాసుపత్రి (జిజిహెచ్‌) లో కోవిడ్‌ టీకా కార్యక్రమాన్ని సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శనివారం ప్రారంభించారు. ముందుగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. ముఖ్యమంత్రి సమక్షంలో హెల్త్‌ వర్కర్‌ పుష్పకుమారి కి తొలి కోవిడ్‌ టీకాను వైద్యులు వేశారు. అనంతరం హెల్త్‌వర్కర్‌ నాగజ్యోతికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. విజయవాడలోని గన్నవరం వ్యాక్సిన్‌ స్టోర్‌ నుంచి అన్ని జిల్లాలకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు.

నేడు రాష్ట్ర వ్యాప్తంగా 332 కేంద్రాల్లో 3.87 లక్షల మందికి తొలిదశలో వ్యాక్సిన్‌ వేయనున్నారు. శనివారం ఉదయం నుంచి ఆయా కేంద్రాల వద్ద నిర్ణయించిన మేరకు ఆరోగ్యశాఖలో పనిచేసే (ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లు) అందరికీ వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఒక్కో కేంద్రం వద్ద రోజుకు 100 మందికి చొప్పున మొత్తం రోజుకు 33,200 మందికి వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు చేపట్టారు.

మొదటి డోసు టీకా ప్రక్రియ సుమారు 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత 28 రోజులకు రెండో డోసు ఇస్తారు. ఇప్పటి వరకూ రాష్ట్రానికి 4.7 లక్షల కోవిషీల్డ్‌, 20 వేల కోవాక్సిన్‌ టీకా డోసులు వచ్చాయి. ప్రతి సెంటర్‌ వద్ద డాక్టర్‌ పర్యవేక్షణ ఉంటుంది. వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద అందరూ భౌతికదూరాన్ని పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి సెంటర్‌లో ఆరుగురు చొప్పున సిబ్బంది పనిచేస్తారు. వ్యాక్సిన్‌ వేసిన తర్వాత ఎవరిలోనైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వారికి తక్షణమే వైద్యసేవలను అందించేందుకు ప్రతి బోధనాసుపత్రిలో అధికారులు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.