పొత్తు లేకుండా 52 స్థానాల్లో పోటీ: ఎంఐఎం ‌

గ్రేటర్‌ ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. దీంతో అధికార పార్టీని ఢీ కొట్టేందుకు విపక్షాలు గెలుపే లక్ష్యంగా గట్టిగానే  ప్రచారాలకు సిద్ధం అవుతున్నాయి. అటు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ కూడా విపక్షాలకు తగ్గట్టుగానే అస్త్రాలను తయారు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో ఎంఐఎం చీఫ్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు కుదుర్చుకోలేదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేస్తూ అసదుద్దీన్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే అభ్యర్థులను ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. భాజపాతో ఎంఐఎం కలిసిందని రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి ఓ వైపు.. తెరాసతో పొత్తు పెట్టుకున్నామని కాంగ్రెస్‌ నేతలు మరోవైపు చేస్తున్న ఆరోపణలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్నారు. గ్రేటర్‌ పోరులో ఇతర పార్టీలతో ఎలాంటి పొత్తు లేకుండా 52 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు అసదుద్దీన్‌ స్పష్టం చేశారు.

2019 ఎన్నికల తర్వాత రాష్ట్రానికి, ప్రత్యేకంగా హైదరాబాద్‌కు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు కేటాయించలేదని.. అందుకే అభివృద్ధి గురించి చెప్పుకొనే పరిస్థితి లేక ఎన్నికలకు మతం రంగులు పులుముతున్నారని అసదుద్దీన్ ఆక్షేపించారు. కరోనా కారణంగా నిరుద్యోగులుగా మారిన లక్షలాది మందికి భరోసా కల్పించకుండా విద్వేషాలను రెచ్చగొడుతున్నారని అసదుద్దీన్‌ విమర్శించారు.