తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవం

 కార్తీక వన భోజన మహోత్సవం ఆదివారం తిరుమల పార్వేట మండపంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి అదనపు ఈఓ ఏవీ.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఏడాది పవిత్రమైన కార్తీకమాసంలో కార్తీక వన భోజన మహోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈసారి కొవిడ్‌-19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని 250 మంది భక్తులతో ఏకాంతంగా నిర్వహించినట్లు తెలిపారు.

ముందుగా ఉదయం 8.30 గంటలకు మలయప్పస్వామివారిని చిన్న గజవాహనంపై ఉభయనాంచారులను పల్లకీపై ఆశీనులను చేసి ఊరేగింపుగా పార్వేట మండపానికి తీసుకొచ్చారు. ఇక్కడి పార్వేట మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి తిరుమంజనం కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.

అనంతరం పార్వేట మండపం వద్ద మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు కార్తీక వనభోజనోత్సవం వైభవంగా జరిగింది. వైదిక సనాతన సంప్రదాయంలో కార్తీకమాసంలో ఉసిరిక వనంలో కార్తీక వనభోజనానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ కారణంగా టిటిడి పార్వేట మండపంలోని ఉసిరిక వనంలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.