భాజపాను ఓడించినందుకు అభినందనలు
దిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాను ఓడించినందుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రితో పాటు బెంగాల్ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నట్లు రాహుల్ గాంధీ ట్విటర్లో పేర్కొన్నారు. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పును వినయపూర్వకంగా అంగీకరిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీకి మద్దతు తెలిపిన లక్షలాది మంది కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉన్నత విలువలు, ఆదర్శాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు.
ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్ష కూటమి పేలవమైన ప్రదర్శన కనబరిచింది. గత ఎన్నికల్లో (2016)లో 44 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్ ఈసారి ఖాతా కూడా తెరవలేదు. కమ్యూనిస్టులు కేవలం ఒక్క స్థానానికే పరిమితమయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 26 స్థానాల్లో గెలుపొందిన సీపీఎం.. ఈసారి పూర్తిగా విఫలమయ్యింది. అటు భారీ మెజారిటీ సాధించిన తృణమూల్ కాంగ్రెస్ మాత్రం మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది.