మాజీ రాష్ట్రపతికి కరోనా పాజిటివ్‌… తనను కలిసిన వారు స్వీయ ఐసొలేషన్‌లోకి వెళ్లాలని సూచన

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకింది. తాను కరోనా వైరస్ బారిన పడినట్లు ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందట ఆయన ఓ ట్వీట్ చేశారు. ఫలితంగా ఆయనను కలిసిన వారికి కరోనా వైరస్ సోకే అవకాశాలు లేకపోలేదు.

సోమవారం ఉదయం తాను ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా.. కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్లు ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. వారం రోజులుగా తనను కలిసిన వారు స్వీయ ఐసొలేషన్‌లోకి వెళ్లాలని ఆయన సూచించారు. కరోనా వైరస్ వైద్య పరీక్షలను చేయించుకోవాలని విజ్ఙప్తి చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని, ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. తన ఆరోగ్యం పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని ప్రణబ్ ముఖర్జీ సూచించారు. ప్రస్తుతం తాను చికిత్స తీసుకుంటున్నానని, త్వరలోనే తాను ఈ మహమ్మారి నుంచి కోలుకుంటానని అన్నారు.