ఫ్రాన్స్లో కరోనా థర్డ్ వేవ్: ప్రధాని జీన్ కాస్టెక్స్
ప్యారిస్: ఫ్రాన్స్లో కరోనా మూడో దశ ప్రారంభమైందని ఫ్రెంచ్ ప్రధానమంత్రి జీన్ కాస్టెక్స్ ఆ దేశ పార్లమెంట్కు వెల్లడించారు. గత ఏడు రోజుల సగటు కేసులు నవంబర్ 20 తర్వాత మొదటిసారిగా 25వేలకు మంచి పెరిగాయని చెప్పారు. మంగళవారం ఫ్రాన్స్లో 29,975 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. నెలన్నర వ్యవధిలో కేసులు భారీగా పెరిగాయని, గతవారంతో పోలిస్తే 4.5శాతం కేసులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. కొత్తగా నమోదవుతున్న కేసులతో దేశంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఆసుపత్రి వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, లాక్డౌన్ను మాత్రం తప్పించవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆ దేశంలో టీకా పంపిణీ మందకోడిగా సాగుతోంది.
బ్రిటన్ కంటే చాలా వెనుకబడి ఉంది. దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ టీకా డ్రైవ్ మహమ్మారిని అడ్డుకోగలదని, మూడో లాక్డౌన్కు వెళ్లకుండా నిరోధించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. భద్రతా సమస్యల నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో టీకా పంపిణీ మరింత జాప్యం కానుంది. ప్రస్తుతం 4,239 మంది రోగులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఒకే రోజు ఫ్రాన్స్ వ్యాప్తంగా మహమ్మారికి 408 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 91,196కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4.11 మిలియన్లకు చేరగా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులున్న దేశాల్లో ఆరో స్థానంలో ఉంది.