భార‌త్ నుంచి నేపాల్, శ్రీలంక‌కు ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్లు

భార‌త్ లో తయారైన కరోనా వ్యాక్సిన్లను భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ లకు ఉచితంగా ఎగుమతి చేస్తామ‌ని కేంద్ర ప్రభుత్వం ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో.. ఆక్స్‌ఫ‌ర్డ్-ఆస్ట్రాజెనెకా సౌజ‌న్యంతో పూణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లను ఈ రోజు ఉదయం నేపాల్‌ రాజధాని ఖాట్మాండుతో పాటు బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాకు తరలించారు.

ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో వీటిని పంపారు. మొద‌టి ద‌శ‌లో నేపాల్‌కు మొత్తం 10 లక్షలు, బంగ్లాదేశ్‌కు 20 లక్షల డోసులను పంపుతున్నారు.‌ కరోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో పొరుగున ఉన్న ఆయా దేశాల‌కు భారత్ ఇప్ప‌టికే ఔష‌ధాలు, వైద్య ప‌రిక‌రాల‌ను కూడా పంపిన విష‌యం తెలిసిందే. భారత్‌ నుంచి మొత్తం 30 మిలియన్‌ డోసుల ‘కోవిషీల్డ్‌’ను కొనుగోలు చేసేందుకు శ్రీలంక ప్ర‌భుత్వం ఒప్పందం చేసుకుంది.