IPL 2020 పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ మరో విక్టరీ
షార్జా వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 46 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 184 పరుగుల భారీ స్కోర్ సాధించగా.. రాజస్థాన్ 138 పరుగులకే కుప్పకూలిపోయింది.
మొదట బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 184 పరుగులు చేసింది. షిమ్రాన్ హెట్మైర్ (24 బంతుల్లో 45; 1 ఫోర్, 5 సిక్సర్లు), స్టొయినిస్ (30 బంతుల్లో 39; 4 సిక్సర్లు) మెరిపించారు. ఆర్చర్ 3 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 138 పరుగులే చేసి ఆలౌటైంది. రాహుల్ తేవటియా (29 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్లు), యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 34; 1 ఫోర్, 2 సిక్స్లు) మెరుగనిపించారు. ఢిల్లీ బౌలర్ రబాడా 3 వికెట్లు తీశాడు. కీలకమైన 2 వికెట్లు తీసిన అశ్విన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఈ మ్యాచ్లో 82 పరుగులకే రాజస్తాన్ సగం వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కంటే మరో ఓపెనర్ బట్లర్ (13) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. కెప్టెన్ స్మిత్ (17 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) కంటే నిర్లక్ష్యంగా సామ్సన్ (5) వికెట్ పారేసుకున్నాడు. ఆండ్రూ టై (6), ఆర్చర్ (2)లు కూడా బ్యాట్లు ఎత్తేయడంతో 100 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన రాయల్స్ లక్ష్యానికి అసాధ్యమైన దూరంలో నిలిచింది. తేవటియా కొట్టిన ఫోర్లు, సిక్సర్లు రాజస్తాన్ ఓటమి అంతరాన్ని తగ్గించాయే తప్ప గెలిచేందుకు పనికి రాలేదు. బ్యాటింగ్లో మెరిపించిన స్టొయినిస్ (2/17) కీలకమైన వికెట్లతో బంతితోనూ రాజస్తాన్ను దెబ్బతీశాడు.