ఆక్సిజన్‌ రవాణాపై ఆంక్షలు విధించొద్దు: రాష్ట్రాలను ఆదేశించిన కేంద్రం

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ నిరంతరాయంగా సాగాలని కేంద్రం ఆదేశించింది. ఆక్సిజన్‌ సరఫరాలపై రాష్ట్రాల సరిహద్దుల్లో ఎలాంటి ఆంక్షలు విధించొద్దని స్పష్టం చేసింది. కఠినమైన ‘విపత్తు నిర్వహణ చట్టం 2005’ను అనుసరించి ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా వెల్లడించారు.

కొన్ని రాష్ట్రాలు ఆక్సిజన్‌ సరఫరాపై ఆంక్షలు విధిస్తున్నాయని వస్తున్న వార్తల నేపథ్యంలోనే కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది. కేసుల ఉద్ధృతి నేపథ్యంలో సొంత రాష్ట్రంలోని అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని పలు రాష్ట్రాలు ఆక్సిజన్‌ రవాణాపై పరిమితులు విధించాయన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం విపత్తు నిర్వహణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిబంధనల్ని ఉల్లంఘించకుండా చూడాల్సిన బాధ్యతను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు అప్పగించింది. తాజా నిబంధనల ప్రకారం.. రాష్ట్రాలు, జిల్లాలు, నగరాల మధ్య ఆక్సిజన్‌ రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండకూడదు.