మా సహనాన్ని పరీక్షించొద్దు: కేంద్రానికి రైతు సంఘాల హెచ్చరిక

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ఉత్తరాదిన ఉన్న రైతు సంఘాలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా ఉద్ధృతి కారణంగా ఈ ఉద్యమం కొంచెం నెమ్మదించినప్పటికీ… నిరసనల్లో పాల్గొంటున్న రైతులు మాత్రం ఢిల్లీ సరిహద్దుల్లోనే ఉన్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి రైతు సంఘాలు మరోసారి హెచ్చరికను జారీ చేశాయి. తమ సహనాన్ని పరీక్షించవద్దని.. వెంటనే చర్చలను ప్రారంభించాలని, తమ డిమాండ్లను అంగీకరించాలని డిమాండ్ చేశాయి.

ఢిల్లీ సరిహద్దులో ఉంటూ ఉద్యమం చేస్తున్న రైతుల్లో ఎక్కువగా పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ వారే ఉన్నారు. వీరందరూ ఢిల్లీ సరిహద్దులైన సింఘు, టిక్రి, ఘాజీపూర్ లలో గత ఆరు నెలలుగా నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు.

మరోవైపు కేంద్రానికి, రైతు సంఘాలకు మధ్య ఇప్పటి వరకు 11 రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ.. ఎలాంటి పురోగతి కనిపించలేదు. రానున్న రోజుల్లోనైనా ఈ నిరసనలకు, చర్చలకు ఒక శాంతియుత సమాధానం దొరుకుతుందో? లేదో? వేచిచూడాలి.