జగన్ ఐదేళ్ల పాలనలో పేదలకు కలగా మిగిలిన సొంతింటి కల
- జగనన్న కాలనీల పేరుతో భారీ అవినీతి
- పునాదుల్ని దాటని ఇళ్లు.. మొండి గోడలతో జగనన్న కాలనీలు
- జనసేన సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజి
చిలకలూరిపేట: పేదలకు సొంతింటి కల సాకరం చేస్తానని సీఎం జగన్ మోసపు హామీలతో పేద ప్రజలను ఐదేళ్ల పాటు మభ్యపెట్టారని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజి చెప్పారు. శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బాలాజి మాట్లాడుతూ జగన్ ఐదేళ్ల పాలనలో పేద ప్రజలకు కనీస అవసరాలు కల్పించటంలో విఫలమయ్యారని మండి పడ్డారు. ‘ఒక్క అవకాశం ఇవ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తా.’ అని జగన్ చెబితే నమ్మి ఓట్లు వేసిన పాపానికి పేదలకు రిక్తహస్తలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘పేదలందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తాం.. ఐదేళ్లలో 25 లక్షల గృహాలు నిర్మిస్తామ’ని గొప్పలు చెప్పారని. ఇదే విషయాన్ని గొప్పగా నవరత్నాల మ్యానిఫెస్టోలోనూ ముద్రించారని గుర్తు చేశారు. జగనన్న కాలనీల పేరుతో అవినీతి
‘మేము కట్టేవి ఇళ్లు కాదు.. ఊళ్లం’టూ ఉపన్యాసాలు ఇచ్చారని, కనీసం ఊళ్లకు దూరంగా పొలాల్లో సెంటు భూమి కేటాయించి పునాది రాళ్లు కూడా వేయకుండానే అంతా అయిపోయిందని ప్రజలను ఏమార్చేప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. ఇప్పటికి జగన్ ప్రభుత్వం చేపట్టింది 18.43 లక్షల ఇళ్ల నిర్మాణమేని, ఎన్నికల తర్వాత వెళ్లే పోయే ప్రభుత్వం మిగిలిన ఈ 18.43 లక్షల నిర్మాణాలను 2023 డిసెంబర్ నాటికే తామే పూర్తి చేస్తామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగనన్న కాలనీల ఏర్పాటు పేరుతో ఎక్కడిక్కడ అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు కోట్ల రూపాయాల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. చిలకలూరిపేటలోనూ జగనన్న కాలనీల విషయంలో పెద్ద ఎత్తున్న అవినీతి చోటు చేసుకుందని తెలిపారు. చాలా చోట్ల వైసీపీ నేతలు, వారి అనుచరులకు మేలు జరిగేలా ప్రైవేటు స్థలాల కొనుగోలు జరిగిందన్నారు. ఎక్కువ భాగం లబ్ధిదారులకు వారు నివాసం ఉండే ప్రాంతానికి కిలోమీటర్ల దూరంలో.. లేదంటే.. కొండలు, గుట్టల మీద, చెరువుల పక్కన.. లోతట్టు ప్రాంతాలు, మునకకు గురయ్యే చోట స్థలాల్ని కేటాయించారని, ఈ ప్రాంతంలో ఇళ్లు కట్టుకొని స్థిర నివాసం ఉండటం అసాధ్యమన్నారు. ఇళ్లు ప్రారంబించి అప్పులతో మిగిలారు. అధికారులు, వైసీపీ నాయకుల టార్గెట్ల కోసం నిరా్మనుష ప్రాంతాల్లో ఇళ్లు ప్రారంభించిన లబ్దిదారులు పూర్తి కాని ఇళ్లలోకి వెళ్లలేక, తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతమౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదని ఆ ప్రాంతంలో వెళ్లలేక అనేక మంది వచ్చిన ధరకు తెగనమ్ముకొని ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఫలితంగా జగనన్న కాలనీలు ప్రస్తుతం పునాదుల్ని దాటని ఇళ్లు. మొండి గోడలతో దర్శనమిస్తోన్నాయని వెల్లడించారు.