జమ్ములో ఎన్‌కౌంటర్‌.. మరో ఇద్దరు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జమ్ములోని షోపియాన్‌ జిల్లా హాదిపొరాలో శనివారం సాయంత్రం భద్రత బలగాలు, కశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా టెర్రరిస్టుల కోసం గాలింపు చేపట్టారు. ఈ సందర్భంగా నిన్న రాత్రి నుంచి ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. భదత్రా బలగాల కాల్పుల్లో నిన్న ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇవాళ తెల్లవారుజామున మరో ఇద్దరిని మట్టుబెట్టారు.

టెర్రరిస్టులు ఏ సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియరాలేదని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు వెల్లడించారు. కాగా, ఉగ్రవాదుల్లో ఒకరు కొత్తగా రిక్రూటైన యువకుడు ఉన్నాడని, అతన్ని లొంగిపోవాల్సిందిగా కోరామన్నారు. అతని తల్లి దండ్రులు కూడా లొంగిపోవాలని అభ్యర్థించారని తెలిపారు. అయినప్పటికీ మిగిలిన టెర్రరిస్టులు అతను లొంగిపోవడానికి అనుమతించలేదని వెల్లడించారు.

రెండు రోజుల క్రితం షోపియాన్‌ టౌన్‌లోని జాన్ మొహల్లా ప్రాంతంలో ముష్కరులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో ముగ్గురు ఉగ్రవాదులను జవాన్లు ఎన్‌కౌంటర్‌ చేశారు.