పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిపై వివాదం

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆయన చుట్టూ ఒక వివాదం ముసురుకుంది. ఢిల్లీ పర్యటనకు ఆయన ప్రైవేట్ జెట్ విమానంలో వెళ్లడం విమర్శలకు తావిస్తోంది. ఈ విమానంలో ఆయనతో పాటు పీసీసీ చీఫ్ సిద్ధూ, డిప్యూటీ సీఎంలు సుఖ్ జిందర్ సింగ్, ఓపీ సోనీ కూడా ప్రయాణించారు. కేబినెట్ ఏర్పాటుకు సంబంధించి హైకమాండ్ తో అత్యవసర సమావేశం కోసం వారు ఢిల్లీకి వెళ్లారు. విమానం వద్ద వారు తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో సిద్ధూ షేర్ చేశారు.

ఈ ప్రయాణంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. కేవలం 250 కిలోమీటర్ల ప్రయాణానికి ప్రైవేట్ జెట్ అవసరమా? అని ప్రశ్నిస్తున్నాయి. చండీగఢ్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి సాధారణ విమానాలు లేవా? అని మండిపడుతున్నాయి. జెట్ విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శిస్తున్నాయి.