ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్.. ఓటింగ్ శాతం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. అయితే గ్రేటర్ ఎన్నికలను లైట్ తీసుకున్నారు హైదరాబాదీలు. చాలా కేంద్రాల్లో ఓటర్లు లేక పోలింగ్ సిబ్బంది ఖాళీగా కూర్చున్నారు. ఉదయం సమయంలో ఎక్కువగా నమోదైన పోలింగ్.. మధ్యాహ్నం భారీగా తగ్గిపోయింది. మొత్తంగా గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో పోలింగ్ శాతం దారుణంగా పడిపోయింది. ఉదయం నుంచి మందకొడిగా సాగిన పోలింగ్‌ మధ్యాహ్నం తర్వాత కాస్త పుంజుకుంది. మొత్తం 150 డివిజన్లలో కొన్ని స్థానాల్లో మాత్రమే పోలింగ్‌ 50 శాతం దాటింది. కొన్ని చోట్ల కనీసం పోలింగ్‌ 15 శాతం కూడా చేరకపోవడం గమనార్హం. ఐటీ కారిడార్‌లో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారింది. గుర్తుల తారుమారు వల్ల ఒక్క ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో మాత్రమే రీ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. డిసెంబర్ 4న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.