118 ఏళ్ల వయసులో టీకా తీసుకుని ఔరా అనిపించిన బామ్మ!
భోపాల్: కరోనా వ్యాక్సిన్పై పలు అపోహలు ప్రజల్లో ఉన్నప్పటికీ…తొలుత టీకా తీసుకునేందుకు ఆసక్తిని కనబర్చలేదు. అయితే టీకా ప్రాధాన్యత అవగాహన ఏర్పడిన తర్వాత వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఇంకా ప్రజల్లో అపోహాలు వీగిపోలేదనే చెప్పొచ్చు. అయితే వీటన్నింటిని పటాపంచలు చేస్తూ 118 ఏళ్ల వృద్ధురాలు తుల్సా బాయి టీకా వేయించుకుని ఔరా అనిపించారు. మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాకు చెందిన ఈ బామ్మ టీకా తీసుకోవడమే కాదు.. ఇతరులు వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ ఎంతో సురక్షితమైనదని, ఆందోళన చెందవద్దని కూడా పేర్కొన్నారు. కాగా, ఆమెకు ఎంత వయస్సు ఉంటుందో నిర్ధారించేందుకు దస్త్రాలను పరిశీలించాలని సాగర్ జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించగా.. ఆధార్లో ఆమె 1903లో పుట్టినట్లుగా పేర్కొనబడి ఉంది. ఈ లెక్క ప్రకారం వ్యాక్సిన్ తీసుకున్న అతి పెద్ద వయస్కురాలుగా తుల్సా బాయి నిలిచిపోతారు.