రైతులను దోచుకోవడానికి మనసెలా వస్తోంది?

• రైతు భరోసా కేంద్రాలు దళారుల కోసమే ఉన్నాయా?
• మిల్లర్ల చేతిలో పౌరసరఫరాల శాఖ కీలు బొమ్మగా మారింది
• ధాన్యం కొనుగోలులో అక్రమాలపై జనసేన పోరాడుతుంది

ఆరుగాలం కష్టపడి పంట పండించే రైతుల నుంచి బస్తాకు రూ.200 చొప్పున దోచేసుకొంటున్నా సీబీఐ దత్తపుత్రుడిలో చలనం రావడం లేదని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో తీవ్రంగా విమర్శించారు. అంటే ఈ దోపిడీకి సూత్రధారులు ఎవరో రైతాంగానికి, ప్రజలకు అర్థమవుతోంది. రైతులను దోచుకోవడానికి ఈ పాలకులకు మనసెలా వస్తోంది? రైతుల శ్రేయస్సుపట్టని పాలకుడు ఉండటం వల్లే రైతన్నలు, కౌలు రైతులు జీవితంపై విరక్తి చెందుతున్నారు. రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించాం… ఆఫ్రికా కూడా ఆదర్శంగా తీసుకొంటోంది అని గొప్పలు చెప్పుకొంటున్న పాలకులు వరి రైతుల బాధలకు ఏం సమాధానం చెబుతారు. రైతులకు భరోసా ఇవ్వని కేంద్రాలు ఎందుకు? ఆర్బీకేల్లో ధాన్యం అమ్మడానికి వెళ్ళిన రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు ఇప్పటికే మా పార్టీ దృష్టికి వచ్చాయి. అవి దళారులకు నిలయాలుగా మారిపోయాయి. రైస్ మిల్లర్లు రైతుల ఇక్కట్లను ఆసరాగా చేసుకొని గిట్టుబాటు ధర ఇవ్వడం లేదు. రైతుల ఆధార్ వివరాలు నమోదు చేయకుండా మిల్లర్లూ, రైతు భరోసా కేంద్రాల నిర్వాహకులు, పౌర సరఫరాల శాఖ చేస్తున్న మాయ వల్ల అన్నదాతలు మోసపోతున్నారు. వేల మంది రైతుల చిరునామాలు గల్లంతు చేసి కుంభకోణానికి తెర తీసిన విషయాన్ని వైసీపీ ఎంపీ కూడా వెల్లడించి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ప్రభుత్వం తేలిగ్గా తీసుకొంది. ఇది ఒక సమస్యే కాదు అని ఉన్నతాధికారులు, మంత్రులతో చెప్పించడం ద్వారా ఈ కుంభకోణంలో ఉన్న పెద్దలెవరో అర్థమవుతోంది. రైతుల నుంచి ధాన్యం సేకరించి సకాలంలో సొమ్ములు చెల్లించాల్సిన పౌరసరఫరాల శాఖ మిల్లర్ల చేతిలో కీలుబొమ్మగా మారింది. ఫలితంగా రైతులు నష్టపోతున్నారు. రైతులకు గోనె సంచులు ఇవ్వరు, రవాణా ఛార్జీలు ఇవ్వరు… ఆ బాధలు రైతులేని పడుతూ ధాన్యాన్ని చేరిస్తే, సొమ్ములు కూడా ఇవ్వడం లేదు. తొలకరి పంట సమయం మొదలవుతోంది. వారికి పంట పెట్టుబడులు అవసరం. సకాలంలో ధాన్యం అమ్మిన డబ్బులు ఇవ్వకపోతే ఎలా? ధాన్యం కొనుగోలులో అక్రమాలపై జనసేన పార్టీ పోరాడుతుంది. రైతులకు అండగా నిలుస్తుందని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.