ఇలా అయితే ఎలా…ట్రంప్ పై బిడెన్ మండిపాటు..!
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కాబడిన జో బిడెన్ ట్రంప్ పై నిన్నటి రోజున విరుచుకుపడ్డారు. ప్రజలను కాపాడుకోవడం చేతకాని అధ్యక్షుడు మనకు దొరికాడని, కరోనా మహమ్మారి ఈ స్థాయిలో అమెరికాని కబళించడానికి ప్రధాన కారణం కేవలం ట్రంప్ అని బిడెన్ ఫైర్ అయ్యారు. ఎంతో మంది కరోనా కారణంగా మృతి చెందుతుంటే ట్రంప్ చోద్యం చూస్తున్నారని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అధ్యక్షుడు భాద్యతారహిత్యంగా ఉంటే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అమెరికానే ఉదాహరణ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బిడెన్.
కరోనా నుంచి అమెరికా ప్రజలను కాపాడటానికి నిపుణులు ఎంతో శ్రమించి రెండు వ్యాక్సిన్ లు వృద్ది చేశారని అయితే ఈ వ్యాక్సిన్ లపై ప్రజలకు అవగాహన కల్పించే ఏర్పాట్లు కూడా ట్రంప్ చేయకపోవడం ఎంతో దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డిసెంబర్ 14 న అమెరికా వ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలయ్యిందని, మోడేర్నా వ్యాక్సిన్ డిసెంబర్ 21 న మొదలయ్యిందని అయితే ఈ వ్యాక్సిన్ అన్ని రాష్ట్రాలకు చేరినా ట్రంప్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియలో అనుసరిస్తున్న విధానంపై బిడెన్ మండిపడుతున్నారు.
ట్రంప్ పరిపాలన విభాగం ఏం చేస్తోందో అర్థం కావడంలేదని, మొద్దు నిద్ర పోతోందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీకా ప్రజలకు పంపిణీ చేయడంలో అనుసరిస్తున్న పద్దతులు పాతవని ఇలాంటి పద్దతులు ట్రంప్ పాటించడం వలన ప్రజలకు వ్యాక్సిన్ అందడానికి కొన్ని ఏళ్ళు పడుతుందని బిడెన్ విమర్శించారు.త్వరలో అధికారంలోకి రానున్న తాము ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వ్యాక్సిన్ త్వరితగతిన అందిస్తామని అందుకు తగ్గ ప్రణాళికలు తమవద్ద ఉన్నాయని బిడెన్ అన్నారు.
తమ బృందాలు ఈ విషయంపై ఇప్పటికే పక్కా ప్రణాళికతో సిద్దంగా ఉన్నాయని అధికారం చేపట్టగానే ప్రజలకు అందుబాటులోకి వ్యాక్సిన్ లు ఉంటాయని ప్రకటించారు.