కష్టం చెప్పుకొంటే కక్షగట్టి చంపేస్తున్నారు

* చైతన్యవంతులైన ప్రజలు ప్రశ్నించకపోతే అరాచకం రాజ్యమేలుతుంది
* వారాహి విజయ యాత్రతో రాజకీయాల్లో పెనుమార్పులు
* స్థానిక సమస్యలపై సంపూర్ణ అవగాహన కోసమే వారాహి యాత్ర
*మీసాలు మెలేసే మొనగాళ్ళం అనుకొనే వైసీపీ నేతలు త్వరలో పశ్చాత్తాపడే రోజులు వస్తాయి
* పిఠాపురం నియోజకవర్గం మీడియా సమావేశంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

వారాహి విజయ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తుందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కష్టం చెప్పుకొంటే కక్షగట్టి మరి ఈ ప్రభుత్వం చంపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవ్వాలని ఆకాంక్షించారు. గురువారం పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో జనవాణి- జనసేన భరోసా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కత్తిపూడి జంక్షన్ లో వారాహి విజయయాత్రకు దిగ్విజయంగా శ్రీకారం చుట్టాం. అన్ని నియోజకవర్గాలు తిరిగి స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకోవడమే ఈ యాత్ర ముఖ్యోద్దేశం. సమస్య గురించి తెలుసుకోవడం కంటే… నేరుగా బాధితుల దగ్గరకు వెళ్లి వారి ఆవేదన వింటే దానికి వచ్చే స్పందన వేరుగా ఉంటుంది.
* ఆ యువతి ఆవేదనే జనవాణికి శ్రీకారం
జనసేన పార్టీ జనవాణి కార్యక్రమం నిర్వహించడానికి ఒక యువతి ఆవేదనే కారణం. భద్రత పేరుతో తాడేపల్లిలో ముఖ్యమంత్రి నివాసానికి ఆనుకొని ఉన్న ఇళ్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చేసింది. సరైన వసతి కల్పించకుండానే బాధితుల ఇళ్లు తొలగించారు. ఈ విషయాన్ని వైసీపీ అభిమాని, ప్రభుత్వ వాలంటీర్ అయిన స్థానిక యువతి ఒకరు నాకు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై నేను స్పందించడంతో వారం రోజుల తరువాత కొంతమంది వ్యక్తులు వాళ్ల అన్నయ్య మార్కెట్ కు వెళ్తుండగా కిడ్నాప్ చేసి నాలుగు రోజుల తరువాత చంపేశారు. చనిపోవడానికి ముందు రోజు ఒంగోలు ఉన్నానని చెప్పిన వ్యక్తి .. మరుసటి రోజు శవమై కనిపించాడు. కష్టం చెప్పుకుంటే ఈ ప్రభుత్వం చంపేసింది. ఆమె కార్చిన కన్నీరే జనవాణి కార్యక్రమం పెట్టడానికి కారణమైంది. కరోనా సమయంలో మాస్కులు లేవన్నందుకు డాక్టర్ సుధాకర్ గారిని చనిపోయేలా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించిన ఓ తల్లిని మానసిక స్థితి బాగోలేదని నింద వేసి కాకినాడ ఆస్పత్రిలో పడేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వ్యవస్థలను వాడుకొని భయపెట్టడం ఆవేదన కలిగించింది. చైతన్యవంతులైన ప్రజలు స్పందించకపోతే అరాచకం రాజ్యమేలుతుంది.
* జీతాలు కంటే కరెంటు ఛార్జీలు ఎక్కువ
ఈ రోజు జనవాణిలో పంట కాలువలు, రిజర్వాయర్ ఆధునికీకరణ సమస్యలు, మట్టి మాఫియా ఆగడాలు, మత్స్యకార సమస్యలు, రెల్లి కార్మికుల సమస్యలు ఇలా దాదాపు 34 అర్జీలు వచ్చాయి. ముఖ్యంగా యువత ఉద్యోగ అవకాశాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో దాదాపు 2 వేలకు పైగా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉంటే హైదరాబాద్ లో దాదాపు 1500కు పైగా కంపెనీలు ఉన్నాయి. మన రాష్ట్రంలో వంద కూడా లేవని చెబుతున్నారు. వర్క్ ఫ్రం హోమ్ చేద్దామంటే తమకు వచ్చే జీతాలు కంటే కరెంటు బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన ప్రతి పిటిషన్ ను అధ్యయనం చేస్తాం. సంబంధిత ప్రభుత్వ శాఖలకు పంపించి సమస్యకు పరిష్కారం లభించేలా ప్రయత్నం చేస్తాం.
* వైసీపీ నాయకులకు చేతల్లోనే సమాధానం చెబుతాం
నాపై మీసం మెలిసే వైసీపీ నాయకులను పాకిస్థాన్ సరిహద్దులకు తీసుకెళ్లి అక్కడ మీసం మెలేయమని చెప్పాలి. వైసీపీ నాయకుల కామెడీలకు నేను సమాధానం చెప్పను. నేను సినిమాల్లోనే మీసం మెలేయడం, తొడలు కొట్టడం వంటి వద్దని చెబుతాను. మేం ఎవరినీ వ్యక్తిగతంగా వెటకారం చేయడం లేదు.. మాటలు విసరడం లేదు. ఓ పద్ధతిగా రాజకీయాలు చేయాలని జనసేన పార్టీ భావిస్తోంది. రాష్ట్ర అభ్యున్నతి కోసం మేం కట్టుబడి ఉన్నాం. వారు తిట్టే తిట్లను నేను సంతోషంగా తీసుకుంటాను. వీరు మాట్లాడే ప్రతి మాటకు సమాధానం చెప్పను. దానికి ఒకసారే చేతల్లోనే సమాధానం చెబుతాను. అప్పుడు కచ్చితంగా చింతించి, పశ్చాత్తాప పడతారు. అయితే వైసీపీ నాయకులు మాట్లాడే ప్రతి మాటను మేం గుర్తుపెట్టుకొని తగిన విధంగా సమాధానం చెప్పే రోజులు మాత్రం దగ్గర్లోనే ఉన్నాయి”అన్నారు.