బాలీవుడ్‌ నటుడు దిలీప్‌ కుమార్‌కు అస్వస్థత

బాలీవుడ్ లెజెండ‌రీ యాక్టర్ దిలీప్ కుమార్ (98) ఈ రోజు ఉద‌యం ముంబైలోని హిందూజా ఆసుప‌త్రిలో చేరారు. కార్డియాల‌జిస్ట్ నితిన్ గోఖ‌లె,  ప‌ల్మనాల‌జిస్ట్ జ‌లీల్ ప‌ర్కార్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఆయ‌న‌కు చికిత్స అందుతోంది. దిలీప్ కుమార్ ఆరోగ్య ప‌రిస్థితిని వారు ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి.

దిలీప్ కుమార్ ఏ అనారోగ్య స‌మ‌స్య‌ కార‌ణంగా ఆసుప‌త్రిలో చేరార‌న్న విష‌యంపై స్ప‌ష్టం రాలేదు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి, అందిస్తోన్న చికిత్స‌పై వైద్యులు ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంది. కాగా, గ‌త నెల‌లోనూ దిలీప్ కుమార్ ఆరోగ్య ప‌రీక్ష‌ల నిమిత్తం ఆసుప‌త్రిలో చేరి, రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు.

అలాగే, గ‌త ఏడాది మార్చిలో లాక్‌డౌన్ విధించ‌క ముందు కూడా దిలీప్ కుమార్ అనేక జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. తాను , త‌న భార్య సైరా భాను ఐసోలేష‌న్‌లో ఉంటున్నామ‌ని చెప్పారు. అంద‌రూ క‌రోనా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ ఇళ్ల‌లోనే ఉండాల‌ని సూచించారు.

అనంత‌రం సైరా భాను కూడా ఓ ఫొటో పోస్ట్ చేసి అభిమానుల ప్రేమాభిమానాల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు. గ‌త ఏడాది దిలీప్ కుమార్ సోద‌రులు ఈషాన్ (90), అస్లాం ఖాన్ (88)కి క‌రోనా సోక‌డంతో ముంబైలోని లీలావ‌తి ఆసుప‌త్రిలో చేరారు. ప‌రిస్థితి విష‌మించి ప్రాణాలు కోల్పోయారు.