సువేందు అధికారిపై చోరీ కేసు

బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సువేందు అధికారిపై బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే సహాయ సామగ్రిని కాజేశారంటూ కాంతి మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ బోర్డ్ సభ్యుడు రత్నదీప్ మన్నా ఫిర్యాదు చేయడంతో సువేందు, ఆయన సోదరుడు సౌమేందు అధికారిపై పూర్వ మిడ్నాపూర్ జిల్లాలోని కాంతి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

సువేందు, మున్సిపాలిటీ చీఫ్ సౌమేందు మార్గనిర్దేశాలతో మే 29 మధ్యాహ్నం 12.30 గంటలకు మున్సిపాలిటీ ఆఫీసు గోదాములోకి జొరబడ్డారని, పేదలకు పంచాల్సిన పునరావాస సామగ్రిని ఎత్తుకెళ్లిపోయారని మన్నా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చోరీ కోసం వారిద్దరూ కేంద్ర బలగాలను తోడు తెచ్చుకున్నారని ఆరోపించారు. సువేందుకు అత్యంత సన్నిహితుడు అరెస్టైన జూన్ 1నే సువేందుపైనా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.