ఆనందయ్యకు మద్దతుగా.. కేఏ పాల్

కరోనా వైరస్ నివారణకు నాటు వైద్యం తయారు చేసిన ఆనందయ్యకు క్రైస్తవ మతప్రబోధకుడు కేఏ పాల్ మద్దతుగా నిలిచారు. కరోనా కారణంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని. ఇలాంటి సమయంలో ఆనందయ్యను దేవుడు వరంగా ఇచ్చారన్నారు. వన మూలికలతో కరోనాకు మందును తయారు చేస్తున్న ఆనందయ్యను కాపాడుకోవాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు. ఆనందయ్య మందుకు సైడ్ ఎఫెక్ట్స్ లేవని ప్రభుత్వ సంస్థలే చెపుతున్నాయన్నారు. ఆయన ఉన్న చోటుకి జాతీయ మీడియా వెళ్లి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

కరోనా పేషెంట్లను ప్రైవేట్ ఆసుపత్రులు దారుణంగా దోచుకుంటున్నాయని కేఏ పాల్ మండిపడ్డారు. దోచినకాడికి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే తన తల్లి చనిపోయారని చెప్పారు. కరోనాకు ఇప్పటి వరకు సరైన మందు లేదని.. ఈ నేపథ్యంలో ఆనందయ్య తమతో చేతులు కలపాలని కోరారు. ఆనందయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆనందయ్యతో కలిసి కరోనా మందు తయారీపై ట్రైనింగ్ ఇచ్చేందుకు తమ సంస్థ సిద్ధంగా ఉందని కేఏ పాల్ చెప్పారు.

మందు తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు తెచ్చుకుంటే. మందు తయారీ చేసుకుని వెళ్లొచ్చని సూచించారు. మందు తయారీకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు తాము చేస్తామని తెలిపారు. ఆనందయ్య బయటకు రాగానే అన్ని విషయాలను మాట్లాడతానని చెప్పారు. రక్షణ పేరుతో ఆనందయ్యను ఏపీ ప్రభుత్వం బంధించిందని మండిపడ్డారు.