ఆక్సిజన్ ఉత్పత్తి పెంచండి: ప్రధాని మోదీ

మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. రోజు రోజుకు ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో తగినంత మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరా ఉండేలా ప్రధాని మోదీ సమగ్ర సమీక్ష నిర్వహించారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో కరోనా తీవ్రంగా ఉందని, ఆ రాష్ట్రాల్లో రాబోయే 15 రోజుల్లో ఆక్సిజన్ సరఫరా గురించి కూడా మోదీ సమీక్షించారని పీఎంవో ఓ ప్రకటనలో పేర్కొంది. డిమాండ్‌కు అనుగుణంగా చికిత్స కోసం వినియోగించే ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని మోదీ అధికారులకు సూచించారు. అలాగే ప్రతి ప్లాంట్ సామర్థ్యాన్ని కూడా పెంచాలని సూచించారు. ఆక్సిజన్‌ను సరఫరా చేసే ట్యాంకర్లపై నిరంతర నిఘాను ఉంచాలని మోదీ సూచించారని ప్రధాని కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.