ఆదివారాలు ‘లాక్‌డౌన్‌’: యూపీ సర్కార్

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉగ్రరూపం చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన యూపీ సర్కారు ‘లాక్‌డౌన్‌’ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఆదివారం రాష్ట్రమంతటా లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. దీంతో పాటు నిబంధనలను మరింత కఠినతరం చేసింది. మాస్క్‌లు ధరించకుండా పదేపదే కన్పిస్తే రూ.10వేల వరకు జరిమానా విధించనున్నట్లు వెల్లడించింది.

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి అన్ని జిల్లాల్లో ప్రతి ఆదివారం కఠిన లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఆ రోజు అత్యవసర సేవలు మినహా.. అన్ని వ్యాపార కార్యకలాపాలు మూసివేయాలని స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ రోజుల్లో బహిరంగ ప్రదేశాలను శానిటైజ్‌ చేయాలని ఆదేశించింది.

కరోనా నిబంధనలు ఉల్లంఘించే వారికి కఠిన జరిమానాలు విధించనున్నట్లు వెల్లడించింది. ఒకసారి మాస్క్‌ లేకుండా కన్పిస్తే రూ.1000, రెండోసారి పట్టుబడితే రూ.10,000 జరిమానా ఉంటుందని స్పష్టం చేసింది. వైరస్‌ విజృంభణ దృష్ట్యా రాష్ట్రంలో బోర్డు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూపీ సర్కారు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పాఠశాలలను కూడా మే 15 వరకు మూతపడ్డాయి.

ఉత్తర్‌ప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే 22,339 మంది కొత్తగా వైరస్‌ బారిన పడగా.. 104 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,66,360కి చేరింది.