భారత్ నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా మారాలి: మోడీ

భారత్ నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ప్రపంచాన్ని అనుసంధానించడంలో అంతరిక్షానిది కీలక పాత్ర అని ఆయన పేర్కొన్నారు. ఎండ్ టు ఎండ్ టెక్నాలజీని కలిగి ఉన్న అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటి అని చెప్పారు. అంతరిక్ష పరిశోధనలు నిరంతరం జరగాలని ఆయన తెలిపారు. భారత అంతరిక్ష సంఘం (ఐఎస్‌పీఏ) ను సోమవారం ఉదయం మోడీ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు.

ఐఎస్‌పీఏ వ్యవస్థాపక సభ్యులలో లార్సెన్ అండ్ టూబ్రో, నెల్కో (టాటా గ్రూప్), వన్‌వెబ్, భారతీ ఎయిర్‌టెల్, మ్యాప్‌మైఇండియా, వాల్‌చంద్‌నగర్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ తదితర సంస్థలు ఉన్నాయి. ఇతర సభ్య సంస్థల్లో గోద్రేజ్, అగిస్టా- బీఎస్‌టీ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, బీఈఎల్‌, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, మాక్సర్ ఇండియా తదితర సంస్థలు ఉన్నాయి. పేదల ఇళ్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో శాటిలైట్ ట్రాకింగ్ లేదా నావిగేషన్ టెక్నాలజీ అయినా పాలనను పారదర్శకంగా చేయడానికి సహాయపడుతున్నాయని మోడీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అగ్రశ్రేణి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ముందంజలో ఉందని, ఈ క్రమంలో పేదలకు కూడా డాటాను అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు.