హెలికాప్టర్ లో వచ్చి వరద నష్టం పై కాకి లెక్కలు వేసిన ప్రభుత్వం

• రూ.6 వేల కోట్ల నష్టం జరిగితే జిల్లాకు రూ.2 కోట్లు ఎలా ఇస్తారు?
• తమిళనాడు సీఎం బాధితుల మధ్య తిరుగుతుంటే… మన సీఎం ప్యాలెస్ నుంచి కదలడం లేదు
• ప్రజలు వరద భయంలో ఉంటే వాలంటీర్లు వన్ టైమ్ సెటిల్మెంట్ల కోసం తిరిగారు
• ప్రజల కోరిక మేరకు దుర్ఘటనపై సీబీఐ ఎంక్వయిరీ జరపాలి
• బాధితులకు మొదట అండగా నిలిచింది జనసైనికులే
• తిరుపతి మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

వరద నష్టం విషయంలో వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి పంపిన నివేదిక మొత్తం అసంపూర్తిగా ఉంది… సీఎం హెలీకాప్టర్లో తిరిగేసి, హెలీకాప్టర్ లెక్కలు వేశారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు లెక్కలను కాకి లెక్కలు అంటారు… వైసీపీ ప్రభుత్వ లెక్కల్ని ఇక హెలీకాప్టర్ లెక్కలు అనాలి అన్నారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితికి పూర్తి భిన్నంగా ప్రభుత్వ నష్టం గణాంకాలు ఉన్నాయన్నారు. రూ.6,064 కోట్ల నష్టం వాటిల్లితే ఒక్కో జిల్లా కలెక్టర్ కు రూ. 2 కోట్లు ఇచ్చి ఎలా చేతులు దులుపుకుంటారని ప్రశ్నించారు. వ్యవసాయ రంగానికిగానీ, పాడి పరిశ్రమకుగాని జరిగిన నష్టంపై ఎక్కడా స్పష్టత లేదన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జనసేన పార్టీ మొదటి విడత పర్యటన వివరాలు పాత్రికేయులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్గా రు మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వం వరద నష్టంపై కేంద్రానికి పంపిన నివేదిక మొత్తం పూర్తిగా అస్పష్టంగా ఉంది. ఆ నివేదికలో మొత్తం 26 మంది గల్లంతయ్యారని, 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని, తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్ల సహాయం కావాలని పేర్కొన్నారు. ఆ నివేదిక ఎంత హాస్యాస్పదంగా ఉందంటే క్షేత్ర స్థాయిలో మేము తిరిగినప్పుడు ఇప్పటి వరకు నష్టంపై ఎలాంటి అంచనాలు వేయలేదని ప్రజలు చెప్పారు. ఎన్ని ఇళ్లు కొట్టుకుపోయాయి. ఎన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. వ్యవసాయం, పాడి పరిశ్రమకు ఎంత నష్టం వాటిల్లింది అనే అంశంపై స్పష్టత లేకుండా, క్షేత్ర స్థాయిలో చేయాల్సిన సాయాన్ని

• రూ.10 వేలు కట్టాలని ఇబ్బంది పెట్టారు
భారీ వర్షాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన రోజున ఈ ప్రభుత్వం ప్రజల్ని అప్రమత్తం చేయకుండా, వాలంటీర్ వ్యవస్థను వన్ టైమ్ సెటిల్మెంట్ల కోసం ఇంటింటికీ తిప్పింది. రూ. 10 వేలు కట్టాలని ప్రజల్ని ఇబ్బంది పెట్టింది. కడప జిల్లా మందపల్లి గ్రామంలో పర్యటించినప్పుడు శ్రీ రామన్నగారి నాగేశ్వర అనే ఓ పాడి రైతుని పరామర్శించడం జరిగింది. అతనివి, అతనికి పొరుగున ఉన్నవారివీ కలిపి 60కి పైగా జెర్సీ ఆవులు కొట్టుకుపోయాయి. ఇద్దరు రైతులవే 60 పాడి పశువులు కొట్టుకుపోతే ప్రభుత్వ లెక్కలో కడప జిల్లా మొత్తం 570 పశువులు మాత్రమే నష్టపోయినట్టు చెబుతోంది. ఇవి కాకిలెక్కలు, హెలీకాప్టర్ లెక్కలు కాక ఏంటి? నిజంగా రూ.ఆరు వేల కోట్లకు నష్టం జరిగితే చిత్తూరు జిల్లా కలెక్టర్ కు రూ. 2 కోట్లు, కడప జిల్లా కలెక్టర్ కు రూ. 2.5 కోట్లు ఇచ్చి ఎలా చేతులు దులుపుకుంటారు? కేవలం ఇసుక మాఫియా కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. అంత ఇసుక వచ్చి పడిపోతే మా పొలాల పరిస్థితి ఏంటి? కౌలు రైతుల పరిస్థితి ఏంటి? ఇప్పటికే రూ. 40 వేలు కౌలు చెల్లించారు. అది మీ నివేదికలో ఎక్కడ ఉంది. పశు సంపద కోల్పోయిన కుటుంబాల గురించి మీ నివేదికలో లెక్క ఎక్కడ ఉంది. నివేదికలు రూపొందించాల్సిన యంత్రాంగం ఏమైపోయింది. వాలంటీర్లు ఏమైపోయారు. అటు ప్రజా ప్రతినిధులు చూస్తే ఎవరి వ్యాపారాల్లో వారు బిజీగా ఉన్నారు. మంత్రులు, శాసనసభ్యులు క్షేత్ర స్థాయిలో ఎక్కడా కనబడడం లేదు. ఈ నివేదిక మొత్తం హడావిడిగా ఏరియల్ సర్వే చేసి హెలీకాప్టర్ నుంచి చూసి తయారు చేసినట్టు ఉంది. క్షేత్ర స్థాయిలో ఎలాంటి అధ్యయనం జరగలేదని ప్రజలు చెబుతుంటే నష్ట నివేదిక ఎలా తయారు చేశారు. ఒక్క అధికారి కూడా బాధితుల ఇంట్లో అడుగు పెట్టింది లేదు. ఇళ్లలోకి వచ్చి చూడమని బతిమాలినా అధికారులు ఇంటిలో అడుగుపెట్టడం లేదని మందపల్లి గ్రామస్తులు మా ముందు వాపోయారు. అంచనా ఎలా వచ్చింది.

• ముఖ్యమంత్రికి టైమ్ లేదా?
ఎలక్షన్ అప్పుడు ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసిన ప్రయత్నాలు ఇప్పుడు వారిని ఆదుకోవడానికి ఎందుకు చేయలేకపోతున్నారు. ప్రజలు అధికారుల కోసం ఎదురుచూడడం లేదు. వారు కలెక్టరుకో, ఆర్డీవోకో ఓటు వేయలేదు. ఓటు వేసింది ముఖ్యమంత్రికి. కడప జిల్లాకు ఇంత నష్టం జరిగితే పరామర్శించడానికి శ్రీ జగన్ రెడ్డి గారికి సమయం దొరకలేదు. జరిగిన నష్టానికి పరిహారం ఎంత వస్తుందో తెలియక రైతాంగం ఆందోళనలో ఉన్నారు. అధికారుల తీరు చూస్తే ఇంటింటికీ తిరిగి పూర్తిగా కూలిన ఇళ్లు, మృతుల లెక్కల మినహా పాక్షికంగా దెబ్బ తిన్న ఇళ్ల గురించి పట్టించుకోవడం లేదు. ఇళ్లలో తడిసి ముద్దయిన ధాన్యాన్ని చూడడం లేదు. విపత్తు సంభవించి ఆరు రోజులు గడచినా చాలా ప్రాంతాల్లో ఇప్పటి వరకు వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయలేకపోయారు. ఇది పూర్తిగా పాలకుల వైఫల్యమే. ఎక్కడ చూసినా ప్రజలు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. వారి ఆవేదన వింటుంటే ప్రభుత్వంలో ఉన్నవారు గానీ, యంత్రాంగంగానీ ఏ విధంగానూ ధైర్యం నింపడం లేదు. తిరుపతి మహానగరమన్నారు, స్మార్ట్ సిటీ అన్నారు. అది ఎక్కడా కనబడడం లేదు. పాలకులు అహంకారపూరితంగా ప్రవర్తిస్తున్నారు. చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి, యధేచ్చగా భూ కబ్జాలకు పాల్పడ్డారు.
కొత్తగా ఒక గండి తవ్వి నీటిని మళ్లించి ప్రజల్ని మభ్యపెట్టాలని చూశారు. దాని వల్ల సామాన్య ప్రజలు పడిన కష్టాలు వర్ణనాతీతం.

• ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు
మన ముఖ్యమంత్రి గారి వయసు 48 సంవత్సరాలు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ స్టాలిన్ గారి వయసు 68 సంవత్సరాలు. ఆయన స్వయంగా గొడుగు పట్టకుని వీధి వీధికీ తిరిగి ప్రజల కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేస్తే మీరెందుకు ప్యాలెస్ నుంచి కదలరు. ప్రజానీకానికి ఎందుకు అందుబాటులో ఉండరు. మిమ్మల్ని చూసి… మీ బాటలోనే ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ప్రజల్ని పట్టించుకోవడం మానేశారు. ముఖ్యమంత్రి వెంటనే శాసనసభా సమావేశాలు ముగించుకుని క్షేత్ర స్థాయిలో నష్టపోయిన వారికి అండగా నిలబడాలి. ఈ రోజుకీ గల్లంతైన వారి సమాచారం లేదు. ఏడు రోజులు అయిపోయింది. గల్లంతైన వారి కుటుంబాల పరిస్థితి ఏంటి? మంచి మనస్త్వం, పరిపాలన దక్షత, తక్షణం స్పందించే గుణం లేనప్పుడు ముఖ్యమంత్రికి ఆ పదవిలో కొనసాగే అర్హత కూడా లేదు. ప్రభావిత గ్రామాలకు వెళ్లలేని పరిస్థితులు ఏమీ లేవు. అక్కడ వచ్చిన విపత్తు పూర్తిగా మానవ తప్పిదం. ఉద్దేశపూర్వకంగా చేసింది. ఎక్కువగా నష్టపోయిన ప్రాంతాల్లో తిరిగాం, వరద ప్రభావిత గ్రామాల్లోకి వెళ్లాం. యంత్రాంగం సహాయక కార్యక్రమాలు అందిస్తున్నారు. కానీ ప్రజలకు భరోసా కల్పించలేకపోతున్నారు. ఈ రోజుకీ గ్రామాల్లో కరెంటు లేదు. ముఖ్యమంత్రి దాటవేత ధోరణితో ప్రవర్తిస్తున్నారు తప్ప ప్రజలకు అండగా నిలబడాలన్న పద్దతి ఎక్కడా కనబడడం లేదు.

• ప్రజలే గొప్పగా స్పందిస్తున్నారు

శాసనసభ సమావేశాలను పూర్తిగా రాజకీయ కోణంలో చూస్తున్నారు. నిన్నటి సభ కేవలం సినిమా టిక్కెట్ల బిల్లు ప్రవేశపెట్టడం కోసం పొడిగించారు. ప్రభుత్వం ఉన్నది దీని కోసమేనా. క్షేత్ర స్థాయిలో పర్యటించరా? ప్రజలకు సహకారం అందించరా? ప్రభుత్వం కంటే ప్రజలు గొప్పగా స్పందిస్తున్నారు. వారి వంతు సాయం అందించి వెళ్తున్నారు. ఎన్ఆర్ఐలు, స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి తోడ్పాటు అందిస్తున్నారు. ఎవరైనా క్షేత్ర స్థాయిలో పర్యటిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి. కేవలం అధికార యంత్రాంగం లెక్కల మేరకు పాలిస్తే నష్టపోతారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు, కడప జిల్లాలో మా నాయకులు ప్రతిక్షణం సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గ్రామాల్లో ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా చెబుతున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సమస్యను తీసుకువెళ్లి జరిగిన దుర్ఘటన మీద సీబీఐ ఎంక్వయిరీ, విజిలెన్స్ ఎంక్వయిరీ గానీ వేయించమని అడుగుతున్నారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికార యంత్రాంగం సరైన సమయానికి గేట్లు ఎత్తలేకపోయారు. రాత్రి పూట జరిగి ఉంటే వందల సంఖ్యలో కొట్టుకుపోయే వారు. కుటుంబాలకు కుటుంబాలు కనబడకుండా పోయేవి. ఇసుక మాఫియాను కాపాడడం కోసం ప్రజలను అప్రమత్తం చేయకుండా, అధికార యంత్రాంగాన్ని నిద్రలోకి తీసుకువెళ్లి ప్రజల్ని ఫోన్ చేసి బెదిరించి గేట్లు ఎత్తనీయకుండా చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఎక్కడా చూడలేదు.

• ఎల్జీపాలిమర్స్ తరహాలో రూ.కోటి పరిహారం ఇవ్వాలి
చిత్తూరు జిల్లాకు చెందిన ఓ పెద్ద మంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సహకారం అందించలేదని అడుగుతున్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి. కలెక్టర్ కు మొదటి ఫోన్ కాల్ చేసింది మా జనసైనికులే. బోట్ల కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటపడింది మా జనసైనికులే. క్షేత్రస్థాయిలో నిత్యావసరాలు తీసుకువెళ్లి బాధితులను ఆదుకుంది మా జనసైనికులే. ఇలాంటి సమయంలో కూడా రాజకీయాలు చేయాలా? ప్రతి ఒక్కరు బాధ్యతగా స్పందించాలి. 151 మంది ఎమ్మెల్యేల మెజారిటీ మీకు ఉంటే మా జనసైనికులు ఇంటింటికీ తిరిగి సాయం అందించడం ఎందుకు? మృతులకు రూ.5 లక్షల సాయం ఇస్తున్నామంటున్నారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగినప్పుడు ముఖ్యమంత్రి హడావిడిగా విశాఖ వెళ్లి ఒక్కొక్కరికీ కోటి రూపాయిలు ఇచ్చారు. ఇక్కడ ఆ సాయం ఎందుకు చేయలేకపోతున్నారు. ఒక రాజకీయ పార్టీగా మేము చేయగలిగింది చేస్తాం. ప్రభుత్వ తీరుని జనసేన పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. జనసేన పార్టీ తరఫున రెండు విడతలుగా పర్యటన ఉంటుంది. మొదటి విడత మా పర్యటన ముగిసిన తర్వాత శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి బాధితుల తరఫున ప్రభుత్వం ీద పోరాటం చేస్తారు. రాజధాని వ్యవహారంలో హైకోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తుందేమో అని భయపడే సాంకేతికంగా ప్రభుత్వం వెనకడుగు వేసింది. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను కించపర్చారు. అనాలోచిత నిర్ణయాలతో హడావిడిగా బిల్లులు తెచ్చారు. ఇప్పుడు అక్కడా రివర్స్ టెండరింగ్ విధానం తెచ్చారు. రాజధానుల బిల్లులు వెనక్కి తీసుకున్నారు. మండలి రద్దు బిల్లు వెనక్కి తీసుకున్నారు. శాసనసభలో సభాపతి ఒక కస్టోడియన్ లా ఉండాలి. సభ సజావుగా సాగేలా, సమాన అవకాశాలు ఇవ్వాలి. సభాపతిగారు ఆలోచించాలి. మన రాజ్యాంగంలో, పార్లమెంటరీ ప్రొసీజర్లో ప్రతిపక్ష నాయకుడికీ సమాన స్థానం ఇచ్చారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి రాజధాని రైతులకు అండగా నిలిచారు. శుక్రవారం అమరావతి రైతులకు మద్దతుగా వారు చేస్తున్న మహాపాదయాత్రలో పార్టీ తరఫున పాల్గొనబోతున్నాం” అన్నారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీ పెదపూడి విజయ్ కుమార్, శ్రీ కిరణ్ రాయల్, శ్రీ తాతంశెట్టి నాగేంద్ర, శ్రీమతి ఆకెపాటి సుభాషిణి, శ్రీమతి వినూత కోట, శ్రీమతి ఆరణి కవిత, శ్రీ పగడాల మురళీ తదితరులు పాల్గొన్నారు.