సుపరిపాలన లక్ష్యంగా జనసేన పయనం

•తెనాలిలో నూతన సంవత్సర వేడుకల్లో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
•నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ

రాష్ట్రం కోసం.. రాష్ట్ర ప్రజల కోసం మంచి పరిపాలన అందించే దిశగా జనసేన పార్టీ ముందుకు వెళ్తుందని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. యువత భవిష్యత్తు కోసం, రైతాంగానికి, మహిళలకు తోడుగా నిలబడేందుకు ప్రతి ఒక్కరు కలసి పని చేయాలని 

పిలుపునిచ్చారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పాలనలో చక్కటి మార్పు తీసుకురావడం తథ్యమన్నారు. ఆదివారం తెనాలి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కేక్ కట్ చేసి, నిరు పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. “తెనాలి నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా ప్రజల్లో ఎంతో ఆవేదన చూశాం. మనం ఎందుకు వెనుకబడిపోయామన్న బాధ వారిలో కనబడుతోంది. రానున్న రోజుల్లో మెరుగైన ప్రణాళికతో సుపరిపాలన తీసుకువచ్చే విధంగా కలసి పని చేద్దాం. రాష్ట్రంలోకి అద్భుతమైన పెట్టుబడులు తీసుకురావడం ద్వారా యువతకు అవకాశాలు కల్పించే విధంగా ముందుకు వెళ్దాం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి సమస్యలు తెలుసుకుంటారు” అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజానీకానికి, జనసేన శ్రేణులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తెనాలి నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.