జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్..

కరోనావైరస్‌తో ప్రపంచం మొత్తం తల్లడిల్లితోంది. నిత్యం కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పటివరకూ అందుబాటులోకి వచ్చిన డబుల్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. అయితే ఇప్పుడు సింగిల్ డోస్ టీకా కూడా అందుబాటులోకి రానుంది. దీనికోసం అమెరికా మరో ముందడుగు వేసింది. సింగిల్ డోసుతో కరోనాను అరికట్టే జాన్సన్ జాన్సన్ కోవిడ్ వ్యాక్సిన్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర వినియోగం కోసం జాన్సన్ అండ్‌ జాన్సన్ కొవిడ్‌ వ్యాక్సిన్‌కు శనివారం అనుమతి ఇచ్చింది. కరోనా మహమ్మారిపై పోరాడేందుకు అందుబాటులోకి వచ్చిన మూడో వ్యాక్సిన్‌ జాన్సన్ జాన్సన్. అయితే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లన్నీ రెండు డోసులు కాగా.. ఈ వ్యాక్సిన్‌ మాత్రం ఒకే డోసు. కొత్త వేరియంట్లతో సహా, తీవ్రమైన కేసుల్లోనూ అత్యంత ప్రతిభావంతంగా పని చేస్తుందని ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FDA) వెల్లడించింది.

అమెరికాలో అందుబాటులోకి వచ్చిన జాన్సన్ జాన్సన్ వ్యాక్సిన్‌ గణనీయమైన రోగ నిరోధక శక్తిని పెంచుతుందని అమెరికా అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే ఐదు లక్షల మందికిపైగా అమెరికన్లు మహమ్మారి బారినపడి ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటి వరకు నిర్వహించిన ట్రయల్స్‌లో వ్యాక్సిన్‌ సామర్థ్యం అమెరికాలో 85.9శాతం, దక్షిణాఫ్రికాలో 81.7, బ్రెజిల్‌లో 87.6శాతం ప్రభావంతంగా పని చేసిందని కంపెనీ తెలిపింది. తాజాగా అత్యవసర వినియోగానికి అనుమతి లభించడంతో మార్చి 20 నాటికి మిలియన్‌ మోతాదులను పంపిణీ చేయాలని, జూన్‌ నాటికి వంద మిలియన్‌ డోసులు సమకూర్చాలని కంపెనీ భావిస్తోంది. ఇదిలాఉంటే.. భారత్‌లో ఈ టీకాల ఉత్పత్తి ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.

హైదరాబాద్‌లోని బయొలాజికల్‌-ఈ కంపెనీ కోవిడ్ టీకా ఉత్పత్తిని చేపట్టనుందని జాన్సన్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సార్థక్‌ రణడే వెల్లడించారు. దీనిపై రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరినట్లు ఆయన తెలిపారు. భారత్‌లో ఏటా 60 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.