సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన కమల్

ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల స్వర్గస్థులైన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. తన ట్వీట్‌లో ఈ లేఖను ప్రస్తావించిన కమల్.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఒక గొప్ప గాయకుడికి, తన అన్నయకి తప్పకుండ ఈ గౌరవం దక్కాలని, తమిళనాడులో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు కోరుకుంటున్నారని కమల్ వెల్లడించారు. ఈ విషయంలో ముందడుగు వేసిన ఏపీ సీఎం జగన్ కి కమల్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.

అంతకుముందు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని జగన్ సర్కార్ కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. సంగీతం, కళలకు ఎస్పీ బాలసుబ్రమణ్యం చేసిన సేవలకుగానూ ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని జగన్ కోరారు. ఐదు దశాబ్దాల సంగీత ప్రపంచానికి మర్చిపోలేని సేవలు అందించిన ఆయనకు ఇది మంచి గుర్తింపు ఇచ్చినట్టు అవుతుందని లేఖలో పేర్కొన్నారు.