మున్సిపోల్స్‌లో గులాబీ జెండా రెపరెపలు.. కేసీఆర్ ధన్యవాదాలు

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో మరోసారి ఊపు వచ్చింది.. నాగార్జునసాగర్ బై పోల్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టిన ఆ పార్టీ.. ఇవాళ వెలువడిన మినీ మున్సిపల్ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాన్ని అందుకుంది.. దీంతో.. ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు గులాబీ బాస్, సీఎం కేసీఆర్… రాష్ట్రంలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు (వరంగల్, ఖమ్మం), ఐదు మున్సిపాలిటీలకు (సిద్ధిపేట, నకిరేకల్, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు) జరిగిన ఎన్నికల్లో అన్నింటినీ గెలిపించి.., 74శాతం ఓట్లతో టీఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 248 స్థానాలకుగాను 181 స్థానాలను టీఆర్ఎస్ కు, 3 స్థానాలను మిత్రపక్షం సీపీఐకి కలిపి 184 స్థానాల్లో గెలిపించి టీఆర్ఎస్ కు తిరుగులేదని మరోమారు నిరూపించారన్న కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీయే మా పార్టీ అని తెలంగాణ ప్రజలు నిష్కర్షగా తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారన్నారు… టీఆర్ఎస్ పార్టీకి ఇంతటి అద్భుత విజయాన్ని చేకూర్చిన ఏడు మున్సిపాలిటీల ప్రజలందరికీ సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.