ప్రజలపై కేసీఆర్ పగ తీర్చుకుంటున్నారు: విజయశాంతి

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ తీర్థం పుచ్చుకున్నాక స్పీడ్ పెంచిన రాములమ్మ.. తాజాగా రైతన్నలకు కేసీఆర్ సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని ఫేస్‌బుక్ వేదికగా నిలదీశారు. తెలంగాణలో రైతు బంధు సంగతి దేవుడెరుగు.. రాష్ట్రాన్ని చూస్తుంటే రైతు అన్ని విధాలుగా బంద్ అయ్యేలా సీఎం కేసీఆరే అన్నదాతల పాలిట రాబందులా కనిపిస్తూ పరిస్థితులు ఘోరంగా మారిపోయాయని విజయశాంతి విమర్శించారు.

‘ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని మూసేస్తామని కేసీఆర్ గారు అలా అన్నారో లేదో దాదాపు 4 వేల కొనుగోలు కేంద్రాలకు తాళాలు పడ్డాయి. ఫలితంగా మిల్లర్లు, వ్యాపారులు రైతులకు చుక్కలు చూపిస్తూ ధర తగ్గించేశారు. మరోవైపు రైతుల దగ్గరే దాదాపు 40 లక్షల టన్నుల ధాన్యం మిగిలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ధాన్యం సంగతేమిటో తెలంగాణ రైతుకు మిగిలేదేమిటో సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీఆరెస్ ప్రభుత్వానిదే. ఎంఎస్పీ లేదా కొనుగోలు కేంద్రాలపై కేంద్రం చెప్పని ప్రయోగాలను తెలంగాణలో చేస్తూ ఈ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలపై పగ తీర్చుకునే కార్యక్రమాన్ని చేపట్టారు’ అని విజయశాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.