కొవాగ్జిన్ టీకా వేయించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కరోనా టీకా తీసుకున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఈ ఉదయం ఆయన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా వేయించుకున్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని కోరారు. టీకాపై ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. ప్రధానమంత్రి మోదీ సహా పలువురు టీకా తీసుకుని ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. కాగా, కిషన్‌రెడ్డి టీకా తీసుకుంటున్న సమయంలో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ఆయన పక్కనే ఉన్నారు. ఈటల నిన్ననే వ్యాక్సిన్ వేయించుకున్న విషయం తెలిసిందే.