లఖింపుర్ ఖేరి ఘటన: పట్టాలపైకి రైతన్నలు
లఖింపుర్ ఖేరి ఘటన నేపథ్యంలో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) సోమవారం దేశవ్యాప్తంగా రైల్రోకో ఆందోళనను నిర్వహిస్తోంది. ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగువరకు నిరసన కొనసాగించనుంది. లఖింపుర్ ఘటనలో తమకు న్యాయం జరగాలని, అప్పటివరకు తమ నిరసనలు ఉద్ధృతం చేస్తామని ప్రకటించింది. ఎటువంటి ఆస్తి నష్టానికి పాల్పడకుండా, శాంతియుతంగా నిరసన కొనసాగించాలని అన్నదాతలకు పిలుపునిచ్చింది.
పంజాబ్, ఉత్తర్ప్రదేశ్లో పలువురు రైతులు పట్టాలపై కూర్చొని తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్రోకో నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా హరియాణా ప్రభుత్వం అప్రమత్తమైంది. సోనీపత్ రైల్వే స్టేషన్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను మోహరించింది. లఖ్నవూలో పోలీసులు 144 సెక్షన్ విధించారు.
కేంద్రం ఇంకా మాతో మాట్లడలేదు: తికాయత్
‘ఒక్కో జిల్లాలో నిరసన ఒక్కోరకంగా ఉంది. కేంద్రం మాత్రం ఇంతవరకు మమ్మల్ని సంప్రదించలేదు’ అని భారతీయ కిసాన్ యూనియన్కి చెందిన రాకేశ్ తికాయత్ మీడియాకు వెల్లడించారు.
ఉత్తర్ప్రదేశ్లోని లఖింపుర్ ఖేరిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై కేంద్రమంత్రి తనయుడు ఆశిష్ మిశ్రా వాహన శ్రేణి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ జరిగిన ఘటనల్లో నలుగురు రైతులతో సహా ఎనిమిది మరణించారు. దాంతో కేంద్ర మంత్రి దిగిపోవాలని, ఆయన తనయుడికి శిక్ష పడాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆశిష్ పోలీసుల అదుపులో ఉన్నారు.