వైసీపీ క్రిమినల్ కోటలను బద్దలు కొడదాం

• డి గ్యాంగ్ అరాచకాలను అరికట్టకపోతే భవిష్యత్తు లేదు
• ఇప్పటికే రాష్ట్రం బిహార్ కంటే దారుణంగా తయారైంది
• నాయకులను చూసి, కార్యకర్తలూ అరాచకవాదులుగా తయారవుతున్నారు
• ప్రశాంతమైన కాకినాడను క్రిమినల్స్ అడ్డాగా మార్చేస్తున్నారు
• కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మదమెక్కి మాట్లాడుతున్నాడు
• సకలం దోచేస్తూ… గూండాగిరి చేస్తున్నాడు
• ద్వారంపూడి రేషన్ బియ్యం మాఫియా ద్వారా కూడబెట్టింది రూ.15 వేల కోట్లు
• గంజాయి మత్తు, బియ్యం మాఫియా, ఇసుక దోపిడీలే రాష్ట్రానికి శత్రువులు
• మహిళల అక్రమ రవాణాకు రాష్ట్రం ప్రధాన కేంద్రంగా మారింది
• శాంతిభద్రతలనేవి పూర్తిగా కనుమరుగు
• ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మళ్లీ గెలవనీయకుండా చూసుకుంటాం
• జగన్ ప్రభుత్వ అవినీతి, ద్వారంపూడి అరాచకాలపై ఆన్లైన్ వేదికగా యుద్ధం
• కాకినాడలో వారాహి విజయయాత్ర బహిరంగసభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ కనుక గెలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని మర్చిపోవచ్చు. ఇప్పటికే బిహార్ కంటే దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అడుగడుగునా అవినీతి, మహిళల అక్రమ రవాణా, గంజాయి మత్తు, ఇసుక దోపిడీ, స్థలాల కబ్జా ఇలా ప్రతి విషయంలోనూ సామాన్యులు పడుతున్న వేదనలు నిత్యం చూస్తున్నాం. పెన్షనర్స్ హెవెన్ గా ప్రశాంతమైన నగరంగా పేరున్న కాకినాడను క్రిమినల్స్ కి అడ్డాగా మార్చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరాచకాలు పరాకాష్టకు చేరాయి. మరోసారి ఇలాంటి డి గ్యాంగులు గెలిస్తే, పూర్తిగా మన ఇళ్లను కూడా దోచుకునే పరిస్థితి వస్తుంద’ని జనసేన అధ్యక్షలు శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా కాకినాడలో సర్పవరం జంక్షన్ లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సభలో శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కాకినాడ నగర నడిబొడ్డున ఉండి చెబుతున్నాను.. ఈ నగరం ఎమ్మెల్యే డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డిని కాకినాడలో మరోసారి గెలవకుండా పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తాత కాలం నుంచి ఇలాంటి అరాచకాలే.
• నాడు డీటీ నాయక్ ట్రీట్మెంట్ ఇస్తే… త్వరలో భీమ్లా నాయక్ ఇస్తాడు
చంద్రశేఖర్ రెడ్డి తాత అక్రమ బియ్యం, దొంగనోట్లు, దౌర్జన్యాల్లాంటివి చేస్తుంటే అప్పట్లో ఈ జిల్లాకు ఎస్పీగా వచ్చిన ఐపీఎస్ అధికారి శ్రీ డీటీ నాయక్ అతన్ని నడిరోడ్డు మీద చేతులకు బేడీలు పోలీసు జీపు వెనుక నడిపించారు. మళ్లీ ఈ డి గ్యాంగు డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డిని ఈ భీమ్లానాయక్ కూడా అదే తీరున రోడ్డుపై నడిపేంచే రోజులు అతి దగ్గర్లోనే ఉన్నాయి. అధికార మదం ఎక్కి, తాగిన మైకంలో ఈ ఎమ్మెల్యే నా మీద నోటికొచ్చినట్లు మాట్లాడాడు. దిగజారి మరీ బూతులు పచ్చిగా తిట్టాడు. నన్ను తిట్టినందుకు కోపం వచ్చి ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిరసన తెలిపేందుకు జనసైనికులు, వీర మహిళలు వెళితే ఎమ్మెల్యే అనుచరులు వారిపై దాడులు చేశారు. నన్ను తిట్టినందుకు కాదు.. మా వీర మహిళలను అసభ్యంగా ద్వారంపూడి అనుచరులు దాడి చేసినపుడు నాకు కోపం వచ్చింది. కచ్చితంగా ఈ ఎమ్మెల్యేను బలంగా ఎదుర్కోవాలని సంకల్పించాను. క్రిమినల్స్ తో నిండిపోయిన వైసీపీ వల్ల ఆంధ్రప్రదేశ్ కు తీరని నష్టం కలుగుతుందని 2014 లోనే చెప్పాను. రౌడీయిజం, గుండాయిజం, దోపిడీ, లూటీ, కబ్జా, అవినీతిలకు మూలంగా మారిపోయిన ఈ ప్రభుత్వంలో నేరం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి అయినా ఎదురు తిరుగుతాం. వారిని ప్రశ్నిస్తాం.
• కావాలనే యువతను విడదీస్తారు

కులాల వారీగా యువతను విడదీస్తేనే వారికి అధికారం. అందుకే యువతలో ఐక్యత ఉండకుండా రకరకాల పన్నాగాలు పన్నుతారు. నేరం చేసిన వాడు ఏ కులమైతే మనకేంటీ..? తప్పు తప్పే కదా..? నిన్న బాపట్లలో 14 ఏళ్ల బాలుడు తన అక్కను వేధిస్తున్నాడని వెంకటేశ్వరరెడ్డి అనే వ్యక్తిని నిలదీస్తే, ఆ వెంకటేశ్వరరెడ్డి ఆ బాలుడిని పెట్రోలు పోసి తగులబెట్టాడు. అప్పుడు కులం ఎందుకు గుర్తుకొస్తుంది..? తప్పు ఎవరు చేసినా ఒక్కటే. ఆ నేరం చేసిన వాడు మనకులం అనుకోలేం కదా..? నేరం చేసిన వాడు ఏ కులమైనా వదిలేది లేదు. రాష్ట్రంలో క్షేమం, భద్రత ఉండాలని బలంగా జనసేన పార్టీ కోరుకుంటుంది. యువతలో భయం పోవాలి. తప్పు చేసిన వారిని ఎదురించే ధైర్యం రావాలి. నేను మంగళగిరిలోనే ఇక అందుబాటులో ఉంటాను. మీ ప్రతి కష్టంలో తోడుగా నిలబడతాను. మీరు పోరాడే స్ఫూర్తిని అందిపుచ్చుకోండి. సినిమా టిక్కెట్ల కోసం గంటల తరబడి క్యూ లో నిలబడే యువతరం పోలింగ్ బూత్ వద్ద నిలబడలేకపోతోంది. మన బతుకులను 5 ఏళ్ల పాటు ప్రభావితం చేసే నాయకులను ఎన్నుకోవడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారు.
• కాకినాడను క్రిమినల్ కోటగా ఎమ్మెల్యే చేసుకున్నాడు
ఒకటి కాదు రెండు కాదు… వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ ఎమ్మెల్యే బియ్యం అక్రమ రవాణా ద్వారా సంపాదించిన సొమ్ము అక్షరాలా రూ.15 వేలు కోట్లు. గోదావరి జిల్లాలకు అనధికార ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. కాకినాడలో అక్కడ ఇక్కడ అని కాదు.. కనిపించిన ప్రతి ఆస్తి, అగుపించిన ప్రతి భూమి ప్రజల నుంచి లాగేసుకుంటున్నాడు. కాకినాడ కేంద్రంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటా ద్వారంపూడి అవినీతి సామ్రాజ్యం విస్తరించింది. ముఖ్యమంత్రి అండ చూసుకొని చెలరేగిపోతున్న ఈ ఎమ్మెల్యే వ్యవస్థలను చెప్పుచేతల్లోకి తీసుకొని అరాచకం సృష్టిస్తున్నాడు. కచ్చితంగా ప్రతి తప్పుకు ప్రజలకు సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది.
• సాటి కులస్తుడిని చంపేసినా కుల నాయకులకు కోపం రాదా?
కులాన్ని అడ్డు పెట్టుకొని నాయకులు ఎదుగుతున్నారు. వారు పెద్దవాళ్లు అవుతున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే దళిత డ్రైవర్ ను చంపి, ఇంటికి పార్శిల్ పంపితే దళిత సంఘాల నాయకులకు కోపం రాదు… 14 ఏళ్ల బీసీ కులానికి చెందిన బాలుడు తన అక్కను ఎందుకు వేధిస్తున్నావని ప్రశ్నిస్తే, ఆ బాలుడ్ని పెట్రోలు పోసి తగులబెట్టి హత్య చేసినా బీసీ సంఘాల నాయకులకు కోపం ఎందుకు రాదు..? ఎందుకు ప్రశ్నించరు. రాష్ట్రంలో దిగజారిపోతున్న శాంతిభద్రతలపై గళం ఎందుకు ఎత్తరు..? పెట్రోలు పోసి తగులబెట్టిన బాలుడి ప్రాణానికి రూ.లక్ష విలువ కట్టి బేరం ఆడిన బీసీ నాయకుడా మనల్ని పాలించేది.. న్యాయం చేయాల్సిన నాయకుడా డబ్బు తీసుకొచ్చి ప్రాణానికి విలువ కట్టేది..? ఈ విషయాలన్నీ ప్రజలు ఆలోచించాలి. చిన్న చిన్న విషయాలకే మనోభావాలు దెబ్బతిన్నాయని బయటకు వచ్చే నాయకులు, సమాజంలో వారివారి కులాలకు చెందిన వారిని హత్య చేస్తుంటే ఎందుకు మాట్లాడటం లేదో అర్ధం కాదు.
• సినిమా వినోదం.. రాజకీయం జీవితం
నాతో పాటు సినిమా రంగంలో ఉన్న అందరి హీరోలంటే నాకు అమితమైన అభిమానం. వారి సినిమాలు బాగా ఆడాలని బలంగా కోరుకుంటాను. జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, ప్రభాస్, చిరంజీవి, రవితేజ ఇలా అందరి హీరోలతో నాకు మంచి సంబంధాలున్నాయి. ఏ హీరో అభిమానులు అయినా సరే నాకు అండగా నిలబడండి. సినిమా వినోదం… రాజకీయం జీవితం అనేది తెలుసుకోండి. మనందరి జీవితాలను శాసించే రాజకీయ నాయకులను ఉన్నత ఆలోచనతో ఎన్నుకోవాల్సిన బాధ్యత యువతరం తీసుకోవాలి. యువతరం కులాలకు అతీతంగా ఆలోచించాలి. ఫీజు రియంబర్సుమెంటుకు మంగళం పాడిన వ్యక్తి, ఉపాధి దూరం చేసిన వ్యక్తి, ఏడాదికి 2.5 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని మోసం చేసిన వ్యక్తిని నమ్ముతారో, ఓ బృహత్తరమైన ఆలోచనతో షణ్ముఖ వ్యూహం అమలు చేసి, యువత పదిమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తెస్తామని మాటిస్తున్న పవన్ కళ్యాణ్ ను నమ్ముతారో ఆలోచించండి.
సొంత బాబాయిని క్రూరంగా హత్య చేసి, మొదట గుండెపోటు అని అన్నారు. తర్వాత హత్య అని బయటకు వచ్చాక చాలామందిపై నెపం నెట్టేయడానికి ప్రయత్నించారు. రాజకీయంగానూ వాడుకున్నారు. ఇప్పుడు వైరాలజీ చదువుకున్న వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీతపై తండ్రి హత్య నింద వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. యూఎస్ లో ఉన్నత చదువులు చదువుకున్న డాక్టర్ సునీత తన తండ్రి హత్య విషయంలో న్యాయం చేయాలని ఎక్కని కోర్టు లేదు… తొక్కని గడప లేదు. చివరకు ఆమెనే నిందితురాలిగా చిత్రీకరించేందుకు సైతం వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారు.
• ఇసుక రాబడికి బాగా అలవాటు పడ్డారు
గతంలో రూ.6 నుంచి రూ.8 వేలు పెడితే ట్రక్కు ఇసుక వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇసుక నిర్వహణ బాధ్యతలను మూడు కంపెనీలకు అప్పగించారు. దానిలో ఒకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది అయితే, మరోకటి ముఖ్యమంత్రి కుటుంబసభ్యులది. ఇంకోకటి వారికి దగ్గరవారిదే. వీరంతా క్షేత్రస్థాయిలో వేర్వేరు వ్యక్తులను బినామీలుగా మార్చుకొని వేలాది కోట్లను దోచేస్తున్నారు. ఈ ఇసుక దోపిడీ, బియ్యం అక్రమ రవాణా అనే ఈ రెండు అరికడితే జనసేన అనుకున్న అద్భుతమైన పథకాలకు నిధుల లోటు ఉండదు. అవినీతికి అడ్డుపడితే… ఆంధ్రా అభివృద్ధికి బోలెడు దారులున్నాయి. యువతరం నిజాయతీ గల వ్యక్తుల సమూహాన్ని అసెంబ్లీకి పంపేలా ఆలోచించండి. సభలకు, ర్యాలీలకు వచ్చే సమయంలో కాదు… ఎన్నికల సమయంలో నాకు అండగా నిలబడండి. దమ్ము, ధైర్యం, శౌర్యం, పోరాటం నిజ జీవితంలో చూపండి. అత్యున్నత పదవిని చేపట్టేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. నా పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపి చూడండి. వారి నుంచి ఏ తప్పు జరిగినా నేను స్వయంగా బాధ్యత తీసుకుంటాను. ప్రజల తరఫున నిలబడతాను.
• ఆడపిల్లలు కనిపించకుండాపోతున్నారు
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో దిగజారిపోయాయని సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారే ఇటీవల వైజాగ్ వచ్చినప్పుడు చెప్పారు. ఆయన ఆ మాటలు మాట్లాడం వెనుక చాలా విషయాలు దాగి ఉన్నాయి. దేశంలోనే ఆడపిల్లల అక్రమ రవాణా, గంజాయి ఎగుమతులు, మట్కా క్లబ్బులు ఇలా ప్రతి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన వద్ద ఉన్న కీలక సమాచారంతోనే మాట్లాడారు. డీజీపీ గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు సవ్యంగానే ఉన్నాయని చెబుతున్నారు. అంతా సవ్వంగానే ఉంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం… వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 33 వేల మంది ఆడపిల్లలు ఎలా మిస్ అయ్యారు..? ఎవరు అపహరిస్తున్నారు..? రాష్ట్రంలో మహిళల అక్రమ రవాణాకు కేంద్రం అయింది. హ్యూమన్ ట్రాఫికింగ్ లో 2వ స్థానంలో ఉంది. యువతులను వైసీపీ క్రిమినల్ గ్యాంగ్స్ ఎక్కడికి తరలిస్తున్నాయో తెలియదు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలోనే 2021లో ఒక యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేస్తే ఇప్పటి వరకు అందులో ప్రసన్న రెడ్డి అనే నిందితుడిని ఇప్పటికీ పట్టుకోలేకపోయారు. అదే తాడేపల్లిలో రాణి అనే దళిత అంధ యువతిని యువకుడు నరికి చంపేశాడు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో 15 ఏళ్ల బాలికపై 10 మంది అత్యాచారం చేసి గర్భవతిని చేస్తే అధికారులు పట్టించుకోలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లా గోరంట్లలో ఫార్మసీ విద్యార్థి తేజస్విని అత్యాచారం చేసి చంపేసిన నిందితులను పోలీసులు కాపాడే ప్రయత్నం చేశారు. వారం రోజుల కింద నెల్లూరులో 22 ఏళ్ల యువతని హత్య చేశారు. రేపల్లెలో భర్తను కొట్టి ఆడబిడ్డపై గ్యాంగ్ రేప్ చేస్తే మహిళా హోమంత్రి దొంగతనానికి వచ్చి, అనుకోకుండా రేప్ చేశారనే చెబుతున్నారంటే పరిస్థితులు ఎంత దిగజారాయో అర్ధం చేసుకోవచ్చు. గతంలో బిహార్ వంటి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కంటే రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయి.
• తొడగొట్టి చెబుతున్నా…
కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి దగ్గర 500 మంది క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి. నెంబర్ ప్లేట్ లేని బైకులపై తిరుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నేను కాకినాడ వస్తున్నానని ఒక యువతి వారాహికి స్వాగతం అని రాస్తే, ఆమెను చంపేస్తామని బెదిరించారు. అలాంటి గూండాలకు కాకినాడ నడిబొడ్డు నుంచి చెబుతున్నాను పద్ధతి మార్చుకోండి లేకపోతే జనసేన ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఒక్కొక్కడిని గుర్తుపెట్టుకొని మరీ రోడ్లపై తన్ని తీసుకెళ్తాం. ద్వారంపూడికి ఒకటే చెబుతున్నాను.. నీ గూండాలు ఆడపిల్లల జోలికి వస్తే మీ తాతకు డీటీ నాయక్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చాడో.. నీకు ఈ బీమ్లా నాయక్ అలాంటి ట్రీట్మెంట్ ఇస్తాడు. నీకు డబ్బు మదం ఎక్కువై కొట్టుకుంటున్నావు. నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూలదోయకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. మాది జనసేన పార్టీ కాదు.
రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి అయితే అందులో 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పేదలకు పంపిణీ చేస్తున్నాం. గతంలో కాకినాడ పోర్టు నుంచి 18 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయ్యేది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అది ఏకంగా 56 లక్షల మెట్రిక్ టన్నులకు చేరింది. రేషన్ డీలర్లు, మిల్లర్లు, పేదల వద్ద రేషన్ బియ్యం తీసుకొని అక్రమ రవాణా చేస్తున్నారు. కాకినాడ పోర్టు కేంద్రంగా డెకాయిట్ ద్వారంపూడి వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ. 15 వేల కోట్లు దోచుకున్నాడు. నాన్న పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్, తమ్ముడు రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు, ఎగుమతులు చేసే కంపెనీ మానస క్వాలిటీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఇలా కుటుంబం మొత్తం మూకుమ్మడిగా దోచేశారు. ఒకవైపు రైతుకు గిట్టుబాటు ధర లేక కన్నీరు పెడుతుంటే… వారి కన్నీటిపై వీళ్లు సంపాదిస్తున్నారు. కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి నాయకులు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి అన్నా, ముఖ్యమంత్రి సన్నిహితుడిగా పేరొందిన ద్వారంపూడి అన్నా వైసీపీ సీనియర్ నాయకులకు భయమే. పవన్ కళ్యాణ్ కు అలాంటి భయాలు లేవు. డెకాయిట్ చంద్రశేఖర్ రెడ్డిని, నటోరియస్, ఫ్యాక్షన్ మైండ్ ఉన్న ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఎదుర్కొంటాం.
• పెన్షనర్ల స్వర్గాన్ని… పేదల నరకానికి కేంద్రం చేశారు
ఎందెందు వెతికినా అందందు ద్వారంపూడి అక్రమాల లీలలే కనిపిస్తున్నాయి. కాకినాడలో కుంభాభిషేకం ప్రాంతాన్ని, శివాలయాన్ని పోర్టు కోసం అని చెప్పి కబ్జా చేశారు. శివాలయం ముఖ ద్వారం ముందు గోడకట్టేశారు. ద్వారపూడి దగ్గర 500 మంది గుండాలు ఉంటే మనమెంతమందో ఒక్క సారి చూసుకోండి. మధ్యతరగతి మేధావుల మౌనం, భయమే క్రిమినల్ రాజ్యమేలాలా చేస్తున్నాయి. మూడు నుంచి 4 శాతం నోటాకు ఓట్లు వేశారు. ఆ ఓట్లు జనసేనకు వేయండి. రౌడీలు, గుండాలను తన్ని తరిమేస్తాం. తన సొంత హెచరీస్ కు సుద్దగెడ్డ దగ్గర వంతెన కట్టుకున్నారు. కొన్నేళ్ల నుంచి కనీసం అక్కడున్న గిరిజనులు వంతెన నిర్మించాలని అడిగినా పట్టించుకోలేదు.
• ఆఖరికి ఎంతకి దిగజారిపోయారంటే..
ఎమ్మెల్యే ద్వారంపూడి కాకినాడ నుంచి సింహాచలం వరకు చేపట్టిన పాదయాత్ర లో కోవిడ్ రోగుల కోసం ఏర్పాటు చేసిన పరుపులు, వంట పాత్రలు పట్టుకెళ్లిపోయారు. కాకినాడను గంజాయి, డ్రగ్స్ కు అడ్డగా మార్చేశారు. తెలంగాణ, యానాం నుంచి అక్రమ మద్యం తీసుకొచ్చి వేలకోట్లు దోచుకుంటున్నారు. విశాఖ డెయిరీ భూములు కబ్జా చేయాలని చూస్తున్నారు. సర్వే ముసుగులో చిన్న స్వామినగర్, పెద్ద స్వామినగర్ లో ఖాళీ స్థలాలను కబ్జా చేస్తున్నారు. నియోజకవర్గంలో ఏ చిన్న పని చేయాలన్న 30 శాతం పర్సంటేజ్ ఇవ్వాల్సిందే. పేదోడి ఇళ్ల స్థలాల పేరిట తీరాన్ని కాపాడుతున్న మడ అడవులను నరికేశారు. ఇలా కాకినాడలో ఈ గూండాల గ్యాంగు చేయని తప్పుడు పని అంటూ ఏదీ లేదు.
తెలంగాణ ఎన్నికలతో పాటే ఆంధ్ర ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. నవంబర్, డిసెంబర్ లో ఎన్నికలు రావొచ్చు. నిన్న మొన్నటి వరకు కాంట్రాక్టర్లకు డబ్బులు లేవని చెప్పిన వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు ముందు కాంట్రాక్టర్లకు రూ. 1500 కోట్లు చెల్లించింది. తనకు కావాల్సిన కాంట్రాక్టర్లు అయిన మిథున్ రెడ్డికి రూ. 600 కోట్లు, రాఘవ కనస్ట్రక్షన్ శ్రీనివాస రెడ్డికి రూ. 300 కోట్లు, ఎంఆర్కేఆర్ కన్ స్ట్రక్షన్ సంస్థకు రఘునాథ్ రెడ్డికి రూ. 250 కోట్లు, వీపీఆర్ ప్రభాకర్ రెడ్డికి రూ. 50 కోట్లు ఇలా వందల కోట్లు చెల్లించింది. వారంతా ఎన్నికల్లో పెట్టుబడి పెట్టేవారు కావడంతోనే వారికి చెల్లింపులు జరిగినట్లు ఓ ఇంజినీరు నాతో చెప్పారు. గత ఎన్నికల్లో భీమవరంలో ఓటర్ల లిస్టులో ఉన్న ఓట్లు కంటే 10 వేలు ఎక్కువ ఓట్లు పోలైయ్యాయి. నేను ఎక్కడ నిలబడినా నన్ను ఓడించడానికి రూ. 200 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారు. దోపిడీ దారుల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలంటే నాతో పాటు నా ఎమ్మెల్యేలను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది.
• అవినీతిపై ఆన్లైన్ యుద్ధం చేద్దాం రండి
వైసీపీ నాయకులు, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రకృతి వనరుల దోపిడీ, కబ్జాలు ఇలా అన్నీ అంశాలపై ఆన్లైన్ వేదికగా కలిసికట్టుగా యుద్ధం చేద్దాం. గతంలో రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిని ప్రపంచానికి ఎలా చూపించగలిగామో అదే మాదిరిగా ఈ ఆన్లైన్ యుద్ధంలో అంతా పాలుపంచుకోవాలి. వైసీపీ రౌడీలు, గూండాలు ఏ చేసినా, ఎలాంటి అవినీతి కార్యక్రమం అయినా వెంటనే ఫొటోలు తీసి ఆన్లైన్ లో హ్యాష్ ట్యాగ్ జోడించి ప్రపంచానికి చూపిద్దాం. # AP_CM_BENAMI, #AP_CM_D_GANG, #YSJaganaAndGang, #YSJaganBenmi హ్యాష్ ట్యాగులు జోడించి కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారికి, రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి, జనసేన కార్యాలయానికి పెట్టండి. కలుగులో ఉన్న క్రిమినల్ ఎలుకలను బయటకు తీద్దాం. ప్రపంచం మొత్తం తెలిసేలా చేద్దాం. క్రిమినల్ సామ్రాజ్యాన్ని కూలదోసి… జగన్ ను రోడ్డు మీదకు తీసుకొద్దాం’’ అన్నారు.