ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం.. టాయ్ ఇండస్ట్రీకి ప్రధాని విజ్ఞప్తి

న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్‌లో టాయ్ మేకింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌ కీలక పాత్ర పోషించాలని ప్రధాని మోడీ కోరారు. ఇండియా టాయ్ ఫెయిర్ 2021 కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టాయ్ మేకింగ్‌లో పునర్వినియోగించే మెటీరియల్‌ను వాడాలన్నారు. అలాగే ప్లాస్టిక్‌ను తక్కువ మోతాదులో ఉపయోగించాలని సూచించారు.

‘భారత జీవన విధానంలో పునర్వినియోగిత వస్తువులను వాడటం ఓ భాగం. టాయ్స్ కూడా దీనికి అద్దం పడతాయి. టాయ్ మేకింగ్‌లో రీసైకిల్, ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్‌ను వాడుతుండటం శుభపరిణామం. ముఖ్యంగా వీటిల్లో వాడుతున్న రంగులు సహజసిద్ధమైనవి, సురక్షితమైనవి కావడం విశేషం. ఇలాగే ప్రకృతికి హాని కలిగించకుండా మంచి నాణ్యతతో టాయ్స్‌ను రూపొందించాలని టాయ్ ఇండస్ట్రీని కోరుతున్నా. ప్లాస్టిక్‌ను తక్కువగా వాడుతూ, మళ్లీ వినియోగించగలిగే మెటీరియల్‌ను యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది’ అని మోడీ చెప్పారు.