ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్ పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందన

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వైసీపీ కోరుతుండడం పట్ల లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. వైసీపీ దాఖలు చేసిన రఘురామ అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకునేందుకు ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. నిర్ణయం తీసుకునే ముందు ఇరుపక్షాలతో చర్చిస్తామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలను పరిశీలించాకే తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

పిటిషన్ పరిశీలన తర్వాత సభాహక్కుల కమిటీకి పంపిస్తామని ఓం బిర్లా వివరించారు. సభలో నిరసన తెలిపేందుకు ఎవరికైనా హక్కు ఉంటుందని పేర్కొన్నారు. సభలో ఏదైనా అంశం ప్రస్తావనకు కొన్ని నిబంధనలు పాటించాలని అన్నారు. రఘురామ అనర్హత పిటిషన్ పై రన్నింగ్ కామెంటరీ (ప్రత్యక్ష వ్యాఖ్యానం) చేయలేమని, పిటిషన్ పరిశీలన ప్రక్రియకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు.