జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి: గురాన అయ్యలు

విజయనగరం, ఈ నెల 14న మచిలీపట్నంలో నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయని, ఈ సభలో జనసైనికులు భారీగా పాల్గొని జయప్రదం చేయాలని విజయనగరం జనసేన నాయకులు గురాన అయ్యలు పిలుపునిచ్చారు. జనసేన ఆవిర్భావ సభ పోస్టర్‌ను పార్టీ నాయకులతో కలిసి మంగళవారం స్థానిక జీఎస్ఆర్ హోటల్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయ్యలు మాట్లాడుతూ భవిష్యత్‌ ఆశల వారధి జనసేన ఆవిర్భావ సభ అని పేర్కొన్నారు. ఈ వేదిక నుంచే భవిష్యత్‌ రాష్ట్ర రాజకీయాలకు పవన్‌ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తారన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవానికి జనసైనికులతోపాటు రాష్ట్ర క్షేమాన్ని కాంక్షించే ప్రతిఒక్కరూ ఆహ్వానితులేనన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే జనసేన లక్ష్యమన్నారు. రాబోయే ఎన్నికలకు జనసైనికులు ఎలా సిద్దం కావాలో పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేస్తారన్నారు. భావితరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే మెరుగైన భవిష్యత్ అందించగలం అనే అంశాలపై జనసేన పార్టీ నుంచి ప్రజల్లోకి ఒక బలమైన సందేశం పంపించేలా ఈ ఆవిర్భావ దినోత్సవ సభ ఉంటుందని స్పష్టం చేశారు. అటు సభకు వచ్చేవారిని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని ఆరోపించారు. సభకు వెళ్లడం తమ హక్కు అని ప్రతి జనసేన కార్యకర్త చాటిచెప్పాలన్నారు. పోలీసులు కూడా తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తమ పార్టీపై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరికీ, సందేహాలు వ్యక్తం చేసినవారికి సభాముఖంగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆదాడ మోహన్ రావు, ఎల్. రవితేజ, ఏంటి రాజేష్, ఎమ్.పవన్ కుమార్, పిడుగు వెంకట్రావు, వై.సురేష్, సాయి, కె.సురేష్ తదితరులు పాల్గొన్నారు.