మార్‌బర్గ్ వైరస్: వైరస్ సోకిన తర్వాతి రోజే వ్యక్తి మృతి.. చికిత్స లేదన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

కొవిడ్ నుంచి ప్రపంచం ఇంకా బయటపడకముందే మరో వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. పశ్చిమాఫ్రికా దేశమైన గినియాలోని గేక్కేడౌలో మార్‌బర్గ్ అనే వైరస్ బారినపడి ఈ నెల 2న ఓ వ్యక్తి మరణించాడు. అతడు అంతకుముందు రోజే ఆ వైరస్ బారినపడ్డాడు. చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

గబ్బిలాల నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని, సోకిన తర్వాత ఏడు రోజులపాటు తీవ్ర ప్రభావం చూపుతుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. దీనివల్ల రక్తనాళాలు కూడా చిట్లిపోతాయి. దీని బారినపడితే 24-88 శాతం వరకు మరణించే అవకాశం ఉంటుంది.ఈ వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సిన్ కానీ, చికిత్సా విధానం కానీ లేవని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వైరస్ కూడా ఎబోలా జాతికి చెందినదేనని పేర్కొంది.

కాగా, ప్రస్తుతం మార్‌బర్గ్ వైరస్ బయటపడిన చోటనే గతంలో ఎబోలా కూడా బయటపడింది. ఈ వైరస్‌కు కూడా కొవిడ్ లాంటి లక్షణాలే ఉంటాయి. రోగితో ప్రత్యక్ష సంబంధం ఉన్న వారికి, రోగి స్రావాలను, రోగి తాకిన ఉపరితలాలను, వస్తువులను తాకడం ద్వారా ఇది వ్యాపిస్తుంది. కరోనాతో 1 నుంచి 5 శాతం లోపు మరణాలు సంభవిస్తే దీని వల్ల అత్యధిక మరణాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.