సెల్ఫీ కోసం రైలు పైకెక్కిన యువకుడు.. విద్యుత్తు తీగలు తాకడంతో..

ఒడిశాలోని పర్లాఖెముండి రైల్వేస్టేషన్‌లో బుధవారం రాత్రి నిలిపి ఉన్న రైలు పైకెక్కి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వేస్టేషన్‌లో నిలిపి ఉన్న రైలు వద్దకు ముగ్గురు యువకులు వెళ్లారు. అందులో ఒక యువకుడు నిలిపి ఉన్న రైలు పైకెక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా పైన ఉన్న విద్యుత్తు తీగలు తగలడంతో మృతి చెందాడు. విద్యుత్తు తీగ నుంచి ఎగిసిపడిన నిప్పు రవ్వలు బోగిపై పడడంతో మంటలు అంటుకుని బోగీలకు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను నియంత్రించారు. మృతుని వివరాలు, ఎన్ని బోగీలు దగ్ధమయ్యాయో వివరాలు ఇంకా తెలియరాలేదు.