2022ను ‘ఏషియన్- ఇండియా ఫ్రెండ్‌షిప్ ఇయర్‌’గా ప్రకటించిన మోదీ

వచ్చే ఏడాదితో ఆసియాన్‌ దేశాల భాగస్వామ్యానికి 30 సంవత్సరాలవుతాయని, ఈ భాగస్వామ్యానికి గుర్తుగా 2022ను ఫ్రెండ్‌షిప్ సంవత్సరంగా జరుపుకుందామని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధాని గురువారం 18వ ఆసియాన్‌- ఇండియా సమ్మిట్‌లో వర్చువల్‌ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియన్‌ దేశాలతో భారత్‌కు సుదీర్ఘ సంబంధాలున్నాయని చెప్పారు.

ప్రపంచం ఇంకా కరోనాతో పోరాడుతుందని, మహమ్మారి కాలంలో భారత్‌ కూడా అనేక సవాళ్లను ఎదుర్కొందని పేర్కొన్నారు. కొవిడ్​ ప్రభావం ఆసియాన్​ దేశాలు-భారత్​ మధ్య స్నేహానికి సవాల్‌గా మారిందన్నారు. ఈ సమయంలో పరస్పర సహకారంతోనే బంధం బలోపేతం చేయగలమన్నారు. ఆసియాన్ దేశాలతో స్నేహమే భారత్​కు ప్రధానం అని స్పష్టం చేశారు. 2022 నాటికి ఆసియన్‌ దేశాల భాగస్వామ్యానికి 30 సంవత్సరాలు, భారత్‌కు కూడా స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతాయన్నారు.

ఈ ముఖ్యమైన మైలురాయికి గుర్తుగా ‘ఆసియాన్‌ – భారత్‌ ఐక్యతా దినోత్సవాన్ని జరుపుకుందామన్న మోదీ.. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. 18వ ఆసియాన్‌- భారత్‌ సమ్మిట్‌ కరోనా మహమ్మారి, అంతర్జాతీయ అభివృద్ధి, వ్యాపారాలు, ఇతర సమస్యలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై సమీక్షిస్తుంది. ఆరోగ్యం, వాణిజ్యం, కనెక్టివిటీ, విద్య సంస్కృతి సహా కీలక రంగాల్లో సాధించిన పురోగతిపై చర్చించనున్నది.