హీరోగా నవీన్ పోలిశెట్టి .. నిర్మాతగా మహేశ్ బాబు!

నవీన్ పోలిశెట్టి.. ఇప్పుడు ఈ పేరుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన కామెడీలో కొత్తదనం గురించి చెప్పుకుంటున్నారు. అందుకు కారణం రీసెంట్ గా వచ్చిన ‘జాతిరత్నాలు’ భారీ విజయాన్ని సాధించడమే.

నవీన్ పోలిశెట్టి ఇంతకుముందు చేసిన ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’ ఆయనకి సక్సెస్ తో పాటు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఆ సమయంలో ఆయనకి వరుసగా అవకాశాలు వచ్చినా, మంచి కథ కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు. అలా చాలా గ్యాప్ తరువాత ఆయన చేసిన ‘జాతిరత్నాలు’ .. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోను భారీ వసూళ్లను రాబట్టింది.

ఈ సినిమాతో నవీన్ పోలిశెట్టి పేరు మంత్రమై మోగుతోంది. ఆయనతో సినిమాలు చేయడానికి పలువురు దర్శక నిర్మాతలు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఆయనతో సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్న బ్యానర్లలో మహేశ్ బాబు సొంత బ్యానర్ కూడా ఉండటం విశేషం.

అసలు చాలాకాలం క్రితమే మహేశ్ బాబు నిర్మాతగా మారాడు. తన సినిమాల నిర్మాణంలో భాగస్వామిగానే కాకుండా, ఇతర హీరోలతోను ఆయన సినిమాలను నిర్మిస్తున్నాడు. అలా తెరకెక్కుతున్న సినిమానే ‘మేజర్’. అడివి శేష్ హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. ఆ తరువాత సినిమా నవీన్ పోలిశెట్టితోనేనని అంటున్నారు. ‘ఛలో’ .. ‘భీష్మ’ వంటి భారీ హిట్లు ఇచ్చిన వెంకీ కుడుముల, ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనుండటం విశేషం. దశ తిరిగితే ఇలాగే ఉంటుందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?