విప్లవ జ్యోతికి నీరాజనాలు

అణచివేతలో ఉద్భవించిన విప్లవాగ్ని శ్రీ అల్లూరి సీతారామరాజు అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో అభివర్ణించారు. పాలకులు ప్రజల సంపద, మాన ప్రాణాల భక్షకులుగా మారిన నాడు.. అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి లోనైననాడు.. ప్రభుత్వాలను కూకటివేళ్లతో పెకిలించే వీరులు ఉదయిస్తారని చెప్పడానికి శ్రీ అల్లూరి సీతారామరాజు నిలువెత్తు తార్కాణం. ప్రకృతి ఒడిలో జీవనయానం సాగించే గిరిపుత్రులకు బతుకు పోరాటం నేర్పి ఆ పోరాటంలోనే అశువులుబాసిన విప్లవజ్యోతి శ్రీ సీతారామరాజు 125వ జయంతి సందర్భాన ఆ మహా వీరునికి నమస్సుమాంజలి అర్పిస్తున్నాను. తెలుగు గడ్డపై జన్మించి, గోదావరి సవ్వడులతో ఎదిగిన శ్రీ సీతారామ రాజు గోదావరి నదికున్నంత గాంభీర్యం, లోతైన ఆలోచన.. ఆయనను కుటుంబం వైపునకు కాకుండా ప్రజాపక్షం వైపు నడిపింది. అచేతనంగా ఉన్న జాతిలో చైతన్యం నింపడానికి ఆయన ఒనర్చిన దీక్ష ఆదర్శప్రాయం. అతి పిన్నవయస్సులోనే గిరిపుత్రుల హక్కుల కోసం విప్లవ బాటను పట్టి.. 27 ఏళ్లకే అమర వీరత్వం పొందిన శ్రీ సీతారామరాజు మన దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి దివిటీగా మారడం తెలుగుజాతికి గర్వకారణం. ఎక్కడ పాలకులు గతి తప్పుతారో.. ఎక్కడ పాలకులు ప్రజా కంటకులుగా మారతారో… ఎక్కడ పాలకులు దోపిడీదారులుగా మారతారో అక్కడ శ్రీ సీతారామరాజు స్పూర్తితో వీరులు పుడుతూనే ఉంటారని చరిత్ర చెబుతూనే వుంది. అటువంటి వీరుడు జన్మించిన ఈ పుణ్యభూమిపై జన్మించడం నా సౌభాగ్యంగా భావిస్తున్నాను. ఏ లక్ష్యంతో శ్రీ అల్లూరి సీతారామరాజు అమరుడయ్యాడో ఆ లక్ష్యం కోసం జనసేన ముందుకు సాగుతుందని ఈ పర్వదినాన మరోసారి ఉద్ఘాటిస్తున్నాను. ఆ విప్లవ జ్యోతికి నా పక్షాన, జనసేన పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.