ఆన్ లైన్ గ్యాంబ్లింగ్‌పై కోహ్లీ, గంగూలీ, రానా, తమన్నాలకు నోటీసులు

ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌పై సెలబ్రిటీలకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్యాంబ్లింగ్‌కు అనుకూల ప్రకటనల్లో నటించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, నటులు దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్, సుదీప్‌లతో పాటు నటి తమన్నాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై ఈ నెల 19వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఆత్మహత్యలకు కారణమవుతున్న ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని తప్పుపడుతూ కోర్టులో పిల్ దాఖలైంది. ఆ పిల్‌పై తాజాగా మద్రాస్ హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌లో వందలాది మంది డబ్బులు పొగొట్టుకున్నారని పిటిషినర్‌ తెలిపాడు. అలాంటి వాటిని డబ్బుల కోసం ఎలా ప్రోత్సహిస్తారని నటులు, క్రికెటర్లను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వీటిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, మద్రాస్ హైకోర్టు వెలువరించిన తీర్పుపై తమిళనాడు సర్కార్ స్పందిస్తూ.. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ రద్దు చేయడానికి 10 రోజులు సమయం కావాలని హైకోర్టును కోరింది.